

నెల్లూరు: నెల్లూరు జిల్లా కోవూరులో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి గెలుపు అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. మార్చి 18వ తేదీన రాష్ట్రంలోని 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఆరు స్థానాలు తెలంగాణలో ఉండగా, కోవూరు స్థానం మాత్రం కోస్తాంధ్రలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం లేదు. కోవూరు మీదనే వైయస్ జగన్ దృష్టి కేంద్రీకరించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

నల్లపురెడ్డి ప్రసన్నకుమర్ రెడ్డి ఇప్పటికే తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో ప్రచార రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెసు తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు. ముగ్గురి మధ్య పోటీ హోరాహారీ జరుగుతుందని భావిస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. కాంగ్రెసు తరఫున ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు కోవూరులో మోహరించడానికి సిద్ధపడుతున్నారు.
అయితే, నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగానే ఉంది. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు శాసనసభ్యుడు, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం కోసం రంగంలోకి దిగనున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
No comments:
Post a Comment