online marketing

Sunday, November 27, 2011

స్తంభానికి కట్టేసి మహిళపై దాడి

నెల్లూరు: నగరంలోని పద్మావతి సెంటర్లో ఒక మహిళను స్తంభానికి కట్టేసి, దాడి చేసిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని నేతాజీనగర్ ఏడో వీధికి చెందిన కుమారి అదే ప్రాంతానికి చెందిన జయంతి వద్ద రూ. 80 వేలు అప్పుగా తీసుకుంది. ఇటీవల రూ. 50 వేలు తిరిగి ఇచ్చేసింది. మిగిలిన రూ. 30 వేలు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని జయంతి మరి కొంత మందిని వెంటబెట్టుకుని వచ్చి కుమారిని ఇంట్లో నుంచి బయటకు లాగి స్తంభానికి కట్టేసి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. బాధితురాలు కుమారి ఫిర్యాదు మేరకు ఐదో నగర ఎస్సై శ్రీనివాసులురెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీవీకే నివాసంలో ప్రసన్న

కొత్తూరు: : ప్రముఖ పారిశ్రామికవేత్త గునపాటి వెంకటకృష్ణారెడ్డి(జీవీకే)ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శనివారం కలిశారు. నాలుగురోజుల క్రితం జీవీకే తల్లి రుక్మిణమ్మ ఆశీర్వాదం తీసుకున్నానని, జీవీకే ఆశీస్సులు పొందేందుకు వచ్చానని ప్రసన్న తెలిపారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలను జీవీకేతో కలిసి సందర్శించారు. జీవీకే సొంత నిధులతో పాఠశాలలో నూతన భవనాల నిర్మాణం చేపట్టనున్నారని, దీనికి సంబంధించి స్థల పరిశీలనకు కలిసి వచ్చామన్నారు. డబ్బు చాలా మంది సంపాదిస్తారని, అయితే పేదల కోసం సొంత ఊరికోసం ఖర్చుచేసే మహోన్నత వ్యక్తి జీవీకే అని ప్రసన్న కొనియాడారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి విజయ్‌కుమార్, మావులూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, జీవీకే ఫౌండేషన్ ప్రతినిధి రామభద్రయ్య, ఖాసిం, జీవీకే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వైవీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

పోటేత్తిన కైవల్యా..

నెల్లూరు :గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సైదాపురం కైవల్యానది ఉధృతరూపం దాల్చుతుంది. వరదనీరు గంటగంటకు పెరుగుతుండటంతో మండల ప్రజలు భయం గుప్పిట్లో వణికిపోతున్నారు. ఈనది సమీపంలో ఉన్న చప్టాపై 8అడుగుల ఎత్తున నీరు ప్రవహిస్తుండటంతో గూడూరు- రాజంపేట రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో 45 గ్రామాలతో పాటు రాపూరు, డక్కిలి మండలాల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ మార్గం గుండా వ్యాపారస్తులు పలు ఇబ్బందులకు గురయ్యారు.

తక్కువ ఛార్జీలతో గూడూరు చేరాల్సిన వీరు ప్రత్యామ్నాయంగా రెట్టింపు ఛార్జీలతో సైదాపురం నుండి పొదలకూరు చేరాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కైవల్యానది రెండోవ రోజుకు చేరడంతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ
నాగరాజు గట్టి చర్యలు తీసుకున్నారు.
చినుకుపడితేనే భయమేస్తుంది: స్థానికుడు చెంచయ్య
చిన్నపాటి వర్షానికే కైవల్యానది ఉధృతంగా ప్రవహిస్తుంది.. దీంతో గూడూరుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నాము. వర్షాకాలంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే భయాందోళనలకు గురౌతున్నారు.

ప్రతి ఏడాది తిప్పలు తప్పవు: స్థానికుడు సిద్ధయ్య
ప్రతి ఏడాది కైవల్యానది చిన్నపాటి వర్షానికే పొంగి పొర్లడంతో తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.

వర్షానికి రోడ్లు ధ్వంసం - ట్రాఫిక్‌కు అంతరాయం

నెల్లూరు  : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాల్లో, పట్టణాల్లోని రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బి హైవే, పంచాయతీ రాజ్‌ శాఖల తారు రోడ్లు గుంటలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామాల్లోని తారు రోడ్లు, సిమెంట్‌ రోడ్లు వర్షానికి తీవ్రంగా గుంటలు ఏర్పడి చిన్న వాహనం పోవాలన్నా కష్టతరంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాయుడుపేట పట్టణంలోని పంచాయతీ సిమెంట్‌ రోడ్లు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. డ్రైనేజ్‌ సిస్టమ్‌ కూడా తీవ్రంగా దెబ్బతినింది.

వర్షం అధికంగా కురవడంతో గ్రామాల్లోని చెరువులు పూర్తిగా నిండి పోవడంతో భయపడ్డ గ్రామస్తులు కలుజులు ఎత్తివేయడంతో ప్రమాదం జరగకుండా చెరువు కట్టలు భధ్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కురిసిన భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యలుగా స్థానిక రెవెన్యూ శాఖకు చెందిన తహసీల్దార్‌ విఠల్‌ తన సిబ్బందిని ఆయా గ్రామాల్లో అప్రమత్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంటలు దెబ్బతినకుండా కాపాడేందుకు రైతులకు ముందు జాగ్రత్త చర్యలు తెలియచేశారు. స్వర్ణముఖి నదిలో నీళ్ళు అధికంగా పారుతున్నాయి. తిమ్మాజికండ్రిగ, మేనకూరు రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మేనకూరు వద్ద ఏర్పాటువుతున్న ఫ్యాక్టరీల దృష్ట్యా రోడ్డు దెబ్బతినడంతో భారీ వాహనాలు రోడ్డుపై నడపలేక లారీ డ్రైవర్లు ఎక్కడికక్కడే నిలుపుదల చేయించారు. జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ వహించి యుద్ధప్రాతిపధికన రోడ్లు రిపేర్లు చేయాలని ప్రయాణీకులు, ప్రజలు కోరుతున్నారు. శనివారం పట్టణంలోని తిరుపతి హైవే రోడ్డు వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం కారణంగా గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల చొరవతో ట్రాఫిక్‌కుఅంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Friday, November 25, 2011

శివారు ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు

నెల్లూరు, :నెల్లూరు నగరానికి ఆనుకునివున్న శివారు ప్రాంతాల్లో రాత్రి 7 గంటలు దాటితే ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోయాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్థానికులు ఎన్నిసార్లు తమప్రాంతానికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్వయంగా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తేకాని తాము రామని భీష్మించుకు కూర్చోవడంతో ఈ ఆకతాయిలపై పోలీస్‌ స్టేషన్‌లలో స్థానికులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. ఫలానా వ్యక్తులు తమ ప్రాంతాల్లో గలభా చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే తిరిగి స్థానిక నాయకుల సహకారంతో స్టేషన్‌ బయటకు వచ్చి తిరిగి తమపై అసభ్యకరమైన పదజాలాలతో ఘర్షణలకు దిగుతారని వాపోతున్నారు. సెల్‌ఫోన్‌ల ద్వారా బాధితులు పోలీస్‌ స్టేషన్‌లకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బాధితుల వైపు నుండి వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా రెండవ పట్టణ పరిధిలోకి వచ్చే కిసాన్‌నగర్‌, సింహపురి కాలనీ, రాజీవ్‌ గాంధీ కాలనీ, జాకీర్‌హుస్సేన్‌ నగర్‌, గాంధీ గిరిజన కాలనీ, తదితర ప్రాంతాల్లో సాయంత్రం 7 గంటల నుండే మద్యం సేవించి రోడ్లకు ఇరువైపులా నిలబడి ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే పాదచారులను అసభ్యకర మైన పదజాలంతో తిడుతూవుంటారు. మహిళలైతే ఈ తిట్ల పురాణం భరించలేక తలలు దించుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానిస్తున్నారు. సమీపంలోని సాయిబాబాగుడి, సీతారామాంజనేయస్వామి గుడి దేవాలయాలు ఉండడంతో సాయంత్రం వేళల్లో స్థానిక మహిళలు ఎక్కువగా ఈ వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మద్యం బాబులతో తమకు తలనొప్పిగా తయారైందంటున్నారు.

రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో 2వ పట్టణ పోలీసులు గస్తీకి సక్రమంగా రాకపోవడంతో వీరు మరింత పెట్రేగిపోతున్నారనేది సమాచారం. ఒకవేళ 2 టౌన్‌ పోలీసులు వచ్చినా 10.30- 11.00 గంటల సమయంలో జీపులో సైరన్‌ వేసుకుంటూ వేగంగా వెళ్లడం, తిరిగి అదేవేగంతో స్టేషన్‌కు చేరుకోవడంతో ముందుగానే సైరన్‌ శబ్ధం వింటున్న మద్యం బాబులు, అల్లర్లకు పాల్పడేవారు సమీపంలోని చీకటి ప్రాంతాల్లో దాక్కోవడం, జీపు వెళ్లగానే తిరిగి రోడ్లపైకి చేరుకోవడం, బహిరంగంగానే రోడ్లపైకి వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మైపాడుగేటు, కిసాన్‌నగర్‌, ప్రశాంతినగర్‌ సెంటర్ల వద్ద ఎక్కువగా నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ విషయాలు స్థానిక పోలీసులకు తెలిపినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతాలన్నీ సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు రికార్డులలో నమోదైవున్నాయి.

స్టేషన్‌కు కొత్త ఎస్‌ఐ వచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. అదేవిధంగా కొత్త బైపాస్‌ రోడ్డుమీద కూడా ఇదే పరిస్థితి నెలకొనివుంది. లీలామహల్‌ సెంటర్‌కు కూతవేటు దూరంలో సిఐ కార్యాలయం, 4వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఉన్నా ఈ ప్రాంతంలో జడ్పీ సెంటర్‌లోనూ, అలంకార్‌ సెంటర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొనివుంది. అలాగే రామలింగాపురం, హరనాధపురం ప్రాంతాలతోపాటు పొదలకూరురోడ్డులోని డైకస్‌రోడ్డు, పద్మావతి సెంటర్‌, సారాయి సెంటర్‌ ప్రాంతాల్లో రాత్రి 7 గంటలు దాటిందంటే ముఖ్యంగా మహిళలు రాకపోకలు సాగించాలంటే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చినా ఇంట్లో ఎవరో ఒకరిని తోడు తీసుకురావాల్సిన పరిస్థితి ఎదురవుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అలాగే నగరంలోని శివారు ప్రాంతంలో ఉన్న ప్రముఖ దేవాలయాల వద్ద కూడా సాయంత్రం సమయంలో వీరి గొడవ ఎక్కువగా ఉందని ఆయా ప్రాంత ప్రజలు చెబుతున్నారు. పోలీసులు ఈ తరహా సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించి అరికట్టాలని, లేనిపక్షంలో అసాంఘీక కార్యకలాపాలు శివారు ప్రాంతాల్లో ఎక్కువైపోయే ప్రమాదం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్‌నిఘాను ఎక్కువగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు. గత రాత్రి కూడా నగరంలోని మినీ బైపాస్‌రోడ్డు ప్రాంతంలో ఒక పార్టీ కార్యాలయం సమీపంలోనే మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా నగర శివారు ప్రాంతాల్లో వున్న సమస్యాత్మక ప్రాంతాల వైపు పోలీసులు తమ దృష్టిని సారించాలని నగర ప్రజలు, ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.

Sunday, November 6, 2011

అమ్దాపూర్‌ శివారులో వృద్దుడి హత్య


బోధన్‌క్రైం: బోధన్‌ మండలంలోని అమ్దాపూర్‌ గ్రామ శివారులో వర్ని మండలం గోవూర్‌ గ్రామానికి చెందిన దండు మైసయ్య (60) అనే వృద్దుడు శనివారం రోజున హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి మృతుడు మైసయ్య అమ్దాపూర్‌ శివారులోని తన పొలంలో గల ధాన్యం కుప్ప వద్దకు కాపల నిమిత్తం వెళ్ళాడు. శనివారం ఉదయం మైసయ్య చిన్న కుమార్తె బోజనం తీసుకుని పొలం వద్దకు వెళ్ళగా ధాన్యం కుప్పపై మైసయ్య మృతి చెంది కన్పించాడు. దీంతో భయందోళనకు గురైన ఆమె ఇట్టి విషయాన్ని గ్రామస్థులకు, బందువులకు సమాచారం అందించగ సంఘటన స్థలానికి చెరుకున్నారు. ఇట్టి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని విచారణ చెపట్టారు.






శనివారం సాయంత్రం పోలీసులు డాగ్‌ స్కాడ్‌ను రప్పించగా కుక్క సంఘటన స్థలం నుండి రోడ్డు గుండా చెరువు వద్దకు వచ్చి ఉన్న బోరు వద్ద అగి తిరిగి చెరువు సమీపం వరకు వెళ్ళి అగిపోయింది. పోలీసులు చెరువులో ఎమైన ఆధారాలు దొరుకుతాయోనని గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. బోధన్‌ డిఎస్పీ జాఫర్‌ జావీద్‌ సంఘటన స్థలానికి చేరుకుని హత్య విషయం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. మృతుడు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు మైసయ్య వద్దనే ఉన్నట్లు తెలిసింది. మృతుడు కుమారుడు శ్రీను పోలీసులకు హత్య గురించి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో శంకరయ్య తెలిపారు.


నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్‌

నెల్లూరు :నగరంలోని ఓ లాడ్జీలో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు సీసీఎస్‌ సిఐ ఎన్‌.సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో నివసించే షేక్‌ ఇలియాజ్‌, షేక్‌ సిరాజ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములను కొత్తహాలు సెంటర్‌లో గల మహేశ్వరి లాడ్జీలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తుండగా అరెస్ట్‌ చేశామన్నారు. ఉన్నత చదువులు చదివిన నిందితులు కంప్యూటర్‌ పరిఙ్ఞానంతో వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, బి.టెక్‌, ఎంటెక్‌, డిప్లమా, ఇంటర్‌, టెన్త్‌ క్లాస్‌ సర్టిఫికెట్లను తయారు చేసి వాటిని బ్రోకర్ల ద్వారా రూ.10 వేల నుండి రూ.20 వేల వరకు అమ్మేవారన్నారు.



నిందితుల్లో సిరాజ్‌ పొదలకూరు మండలంలోని ఓ గ్రామంలో ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నాడని ఆయన తెలిపారు. లాడ్జీలో ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ సహాయంతో సర్టిఫికెట్లను తయారు చేస్తుండగా అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, ప్రింటింగ్‌ పేపర్‌, సీడీలు, రబ్బర్‌ స్టాంపులు, సుమారు 34 వివిధ యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్‌పి రమణకుమార్‌ ఆదేశాలతో నగర ఒఎస్‌డి, డిఎస్‌పి నరసింహ కిషోర్‌ ఆధ్వర్యంలో వీరిని అరెస్ట్‌ చేశామని, తనతోపాటు సీసీఎస్‌ సిబ్బంది హెడ్‌కానిస్టేబుళ్లు కె.వాసుదేవరెడ్డి, కెవి.రమణయ్య, కానిస్టేబుళ్లు శిఖామణి, వెంకటేశ్వర్లు, శేషయ్య, పోలయ్య, సురేంద్ర, వారిస్‌ అహ్మద్‌, ఇలియాజ్‌లను జిల్లా ఎస్‌పి అభినందించి రివార్డులు ప్రకటించారన్నారు.


వర్షంతో కష్టాలు

నెల్లూరు :జిల్లాలో గత 12 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజా జీవితం కష్టాల కడలిగా మారింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. పనులు లేక కూలీలు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై నీటిలోనే పేద, బడుగు వర్గాలు కాపురం చేస్తున్నాయి. పొగాకు, మినుము రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేజర్ల మండలంలో రోడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో అక్కడి రైతులు వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

చిత్త కార్తె అయినప్పటికీ అక్టోబర్‌ 23 అర్థరాత్రి వరకు ఎండలు మండిపోతూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది. 23 అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు ప్రజలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. అతివృష్టి, అనావృష్టి ఏది వచ్చినా పేద ప్రజలు బలవుతున్నారు. 12 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా ప్రజలు అతలాకుతలం అయ్యారు. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాల్లో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు తీరని అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

స్థానిక చంద్రబాబు నగర్‌లో మంచినీటి కుళాయిల్లో మురుగునీరు రావడంతో నీటి కొరత ఏర్పడి ప్రజలు మంచినీటికి అవస్థలు పడుతున్నారు. వర్షాల కారణంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. 15 రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే వంద శాతం వరకు ధరలు పెరగడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితులు కరువయ్యాయి. కలువాయి, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, వరికుంటపాడు, వింజమూరు, ఎఎస్‌.పేట, కలిగిరి, ఉదయగిరి, దుత్తలూరు, రాపూరు, పొదలకూరు, చేజర్ల, డక్కిలి తదితర మండలాల్లో మినుము, పొగాకు రైతులు పంటలు నీట మునిగి భారీ స్థాయిలో నష్టపోయారు. చేజర్ల మండలంలో రోడ్లపైకి నీరు వచ్చి ప్రయాణం ఇబ్బందికరంగా మారింది.

రోడ్లు గుంతల మయం కావడంతో అక్కడి రైతులు రోడ్లపై వరినాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. చేనేత కార్మికులు వర్షాలవల్ల పనులు జరగక పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో పేదల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. తుపానుకాకపోవడంతో ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదని, అంతకన్నా అధికంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Monday, September 5, 2011

నెల్లూరు కోర్టుకు హాజరైన నటి ఆమని, ఆమె భర్త తిట్లపురాణం.....!!

వరకట్నం వేధింపుల కేసులో సినీ నటి ఆమని నెల్లూరు కోర్టుకు హాజరయ్యారు. ఆమని సోదరుడి మొదటి భార్య శశికళ ఆమనిపై, ఆమె కుటుంబ సభ్యులపై వరకట్నం వేధింపుల కింద నెల్లూరు కోర్టులో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఆమని సోదరుడు శశికళకు దూరమై మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.నెల్లూరు కోర్టుకు హాజరైన ఆమని ఫోటోలను మీడియా ప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఆమె భర్త హజ్రత్ మీడియా ప్రతినిధులపై తిట్ల పురాణం అందుకున్నారు. కేసు విచారణను కోర్టు మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.

Monday, August 29, 2011

రాజకీయ పరిఙ్ఞానం లేని వ్యక్తి వివేకా

నెల్లూరు :భారతీయ జనతాపార్టీపై ఆదివారం నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, అధికారం తలెకెక్కి వివేకా మాట్లాడుతున్న మాటలను ఎవరూ పట్టించుకోరని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు కర్నాటి ఆంజనేయరెడ్డి ఆనం వివేకాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవాకులు-చెవాకులు మాట్లాడుతున్నావు. నీకు రాజకీయ పరిఙ్ఞానం లేదని, అందుకే నీవు అలా మాట్లాడుతున్నావని వివేకానందరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆనాడు మొట్టమొదటగా సంతకాలు పెట్టిన నీవు నేడు ఏమీ ఎరగనమ్మా అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ పార్టీలో చేరనని ప్రమాణం చేస్తావా వివేకా? అని ఆంజనేయరెడ్డి సవాల్‌ విసిరారు. నగరంలో అవినీతిని పెంచి పోషిస్తూ ఎక్కడ కట్టడాలు కట్టాలన్నా దండుకుంటున్నావని, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే నీ దండకం ఎవరికీ తెలియంది కాదని, ఈ విషయాలు తెలిసినా తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉందని, సోమిరెడ్డి, వివేకా ఇద్దరు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అన్నారు. నీ పంచన చేరితే మంచివారు. లేదంటే అవినీతిపరులా వివేకా? నీకు తగిన సమయంలో తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.


ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆనాటి ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడ్డారని నీ సోదరుడు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, ఆనాటి క్యాబినెట్‌లో మంత్రిగా వున్న రామనారాయణరెడ్డిపై కూడా సిబిఐ విచారణ చేపట్టాలని, అదేవిధంగా ఆనం కుటుంబ ఆస్తులపై కూడా విచారణ చేయాలన్నారు. అదేవిధంగా సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి బిజెపిని గురించి మాట్లాడుతున్నారని, పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా సుష్మాస్వరాజ్‌ చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే మంచిదని, సుధాకర్‌రెడ్డికి, వివేకాకి హితవు పలికారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భారతీయ జనతాపార్టీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఆనాడు జరిగిన కొన్ని కుంభకోణాలపై ఆరోపణ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


జగన్‌పై సిబిఐ విచారణ జరుగుతుందని విచారణను ఆపమనిగాని, ఆయన అవినీతికి పాల్పడలేదనిగాని భారతీయ జనతాపార్టీ ఎక్కడా ప్రసంగాలు చేసిన సందర్భాలు లేవన్నారు. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసింది మీరు కాదా? మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు మీకు అవినీతి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తూ ఆ అవినీతిలో ఆనాడు మీరు కూడా భాగస్వాములే కదా? అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు బిజెపి బరితగించిందని అంటున్నారని, బరితగించింది ఎవరో, వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికల్లో ఓడిపోయిందెవరో ప్రజలకే తెలుసన్నారు. వైఎస్‌ఆర్‌కి అత్యంత ముఖ్యమైన వారమని ఆనం సోదరులు అనేవారని, ఆ వేల కోట్ల కుంభకోణంలో వీరికి భాగముండాలని, ఇవన్నీ వదిలేసి బిజెపిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, పద్ధతి మానుకోవాలని హెచ్చరించారు.


నీ సోదరుడు జగన్‌ పార్టీ వైపు ప్రయత్నం చేయలేదా? ఇది నిజం కాదా? నీవు అడ్డుకుంటే గొడవలు జరగలేదా? ఇదంతా ఒక నాటకమని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నీ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ప్రయత్నం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. బరితగించింది చంద్రబాబు అని, నీవు అక్రమంగా సంపాదించిన పొలాల సంగతి ఏమిటని, నీపేరు మీద కరెంటు కనెక్షన్‌ ఉందంటే అది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభలో, రాజ్యసభలో బిజెపివారు అవినీతిని సమర్థించారా? అది మీరు విన్నారా? బిజెపి వారి మాటలను వక్రీ రించి మాట్లాడుతున్నారని, మీ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలినవారంతా మీ దృష్టిలో అవినీతిపరులేనా? మీకు వత్తాసు పలికితే అవన్నీ మాసిపోతాయా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబు హైదరాబాద్‌ చుట్టుపక్కలంతా అవినీతికి పాల్పడలేదా? చంద్రబాబు సిబిఐ విచారణ చేయమని అడుగుతారా అని ప్రశ్నించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బాబు ఉన్నారని, గూడూరు వద్ద బాబు రెండవ ఇడుపులపాయను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఇచ్చారు కదా? ఇప్పుడు ఆస్తులు ప్రకటించడం ఏమిటి అని, ఆస్తులు ఇంకా ఎన్ని దాచిపెట్టి ఉన్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. వివేకా నీ పగటి వేషాలు మానుకో. నీకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. ఇకమీదట బిజెపిని విమర్శిస్తే పరిస్థితులు వేరేవిధంగా ఉంటాయని ఆయన వార్నింగ్‌ ఇచ్చారు. బిజెపి నేతలపై విమర్శలు చేసేముందు వాస్తవాలు తెలుసుకుని
మాట్లాడితే మంచిదని, వివేకాను హెచ్చరిస్తూ బిజెపి ఇటువంటి నాయకులకు తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఆనం కుటుంబానిది తత్కాల్‌ రాజకీయమని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే నీచమైన సంస్కృతి మీది అని ఉదాహరణగా చెబుతూ వారిది తత్కాల్‌ రాజకీయమేనన్నారు.

Sunday, August 28, 2011

ఒకే ప్రాంగణంలో శివ కేశవుల

తడ : ఒకే ప్రాంగణంలో శివ కేశవుల అన గా శివుడు, కేశవుడు(విష్ణువు) ల ఆలయాలు, విగ్రహాలు కాశీలో తప్ప మరెక్కడా లేదు. ప్రపంచంలో ఈ అద్భుత ఆలయాలని సందర్శించి పాప, దోషములను పొగొట్టుకొనేం దుకు యావత్‌ భారతీయులందరూ కాశీకి పో తారు. అక్కడికి పోతే పాపాలన్నీ పోయి మళ్ళీ పునర్జ న్మ మనిషికి కలుగుతుందని ప్రతీక. కా ని కాశీలో మాదిరిగానే పులికాట్‌ తీరం లో వున్న వేనాడు దీవిలో కూడా శివ, విష్ణువు ఆల యాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఈ ఆల య ప్రత్యేకత గురించి అధికారులు, పాలకులు ఎవరూ పట్టిం చుకోకపోవడంతో ఇంతటి ప్రా ముఖ్యత గల ఆలయాలు చరిత్ర బయట ప్ర పంప ప్రజలెవరికి తెలియదు.

పూర్వం వేనాడు ను వేదాంతపురి అని పిలిచే వారు.పూర్వ ము శృంగి అనే మహాముని కావడిలో ఒకపక్క శివు ని విగ్రహం మరో పక్క విష్ణువు విగ్రహాన్ని తీసు కొని కాశీ నుంచి రామేశ్వరానికి పయనమ య్యాడు. మార్గమధ్యలో పలు చోట్ల రాత్రి వేళల్లో విశ్ర మిస్తూ మరుసటి దినం యథా విధిగా పాద యాత్ర కొనసాగించే వారుఆ మహాముని. అదే క్రమంలో వేనాడు దీవిలో ఆ ముని ఓ రాత్రి విశ్రమించాడు. మరుసటి దినం ప్రభాత వేళ ప్రయాణానికి సన్నద్ధ్దుడైన ఆ మహాముని కావడిని భూజానికి ఎత్తుకునేం దుకు ప్రయత్నిస్తే కావడిపైకి లేవలేదు.ముని పరిశీలించగా శివకేశవులు భూమిలో ప్రతి ష్టిం చినట్లుగా కనిపించింది.

ఆ రాత్రి అక్కడే వి శ్రమించిన ముని కి స్వప్నంలో శివకేశువులు ప్రత్యక్షమై ఈ స్థలం ప్రభావి తానికి ఇష్టపడి తా ము స్వయంభువుగా ఇక్కడే ప్రతిష్టంబులు అయ్యామని ఆ మునినే తమకు పూజాధిపతు లుగా నియమించమని ఆదేశించినట్లు పురాణ కథనం. అలా ఒకే ప్రాంగణంలో దేవదేవుని ఆలయాలను నిర్మించారు. ఒకే ప్రాంగణంలో విష్ణాలయం, శివాలయం వెలసినందున ఈ గ్రామాన్ని దక్షిణ కాశి అని కూడా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యం కాశీలో తప్ప మరెక్కడా లేదు. అక్కడే గర్భ గుడిలో ప్రతిఏటా చైత్ర మా సం పౌర్ణమికి శ్రీరంగ పెరుమాళ్ళు పాద పద్మా లపై, శివ రాత్రికి శివుని పై సూర్య కిరణాలు ప్ర తి భింబిస్తాయి. ఈ దృశ్యాలు చిత్తూరు జిల్లా నాగాలాపురం వేదనారాయణ స్వామి ఆలయం లో తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. కానీ ఈ ఆలయాన్ని టూరిజం కేడర్‌ చేర్చలేదు. ఇంతే కాకుండా ఆసియా ఖండంలోనే అతి పెద్ద దర్గా ఈ గ్రామంలో ఉండడం మరో విశేషం.

కౌలన్నకు కష్టాలు తీరేనా?

నెల్లూరు :కౌలుదారులకు రుణాలు అందించి వారి క్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అని నెల్లూరు కౌలుదారుల రుణాల పంపిణీ కార్యక్రమ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామంటూ ఓ వైపు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా అవి మాత్రం అసలైన కౌలుదారులకు అందడంలేదు. భూస్వాముల నుంచి పొలాలను కౌలుకు తీసుకుని పండించే రైతన్నకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో కౌలుదారుల రుణాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగానే జిల్లాలో 4,127 మంది కౌలుదారులను ఆయా మండలాల రెవెన్యూ తహసిల్దార్‌లు, గ్రామ విఆర్‌ఒలు గుర్తించడం జరిగింది. వీరికోసం రూ.10.08 కోట్లును రుణాలు పంపిణీ చేసేందుకు లక్ష్యంగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. కాని ప్రస్తుతం జిల్లాలో 500లకు మించి కూడా రైతులకు రుణాలు అందలేదు. దీనికి అసలు కారణం భూయజమాని కౌలు రైతులకు ధృవీకరణ పత్రంలో సంతకం పెట్టకపోవడం ఒక కారణమైతే బ్యాంకులు కౌలు రైతులకు హామీలు ఉండేందుకు రైతులు లేరంటూ కుంటిసాకులు చెప్పి రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన ఈ పథకం జిల్లాలో నీరుగారిపోతోంది.

ఈ పథకాన్ని పటిష్టంగా పూర్తి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం కౌలుదారులకు కార్డులు పంపిణీ చేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకుంది. హంగులూ, ఆర్భాటాల కోసం ముఖ్యమంత్రి చేతులమీదుగా జిల్లాలో కౌలుదారుల రుణాల పంపిణీ పత్రాలను కూడా అందజేసింది. బ్యాంకులు మాత్రం నిబంధనల పేరుతో కౌలు రైతులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. అసలే కౌలు చెల్లించలేక నష్టాలపై వ్యవసాయం చేస్తున్న ఈ రైతులకు ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఏమాత్రం ఉపయోగ పడడంలేదు.

ఇందులో బ్యాంకుల పాత్ర ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ప్రదానంగా కినిపిస్తోంది. ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధిగా ఆయా బ్యాంకులకు విధి విధానాలు పంపకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రైతులను కంటితుడుపు తుడిచేందుకు ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి ఉపయోగం లేకుండా చేస్తున్నాయి. ‘ఫలహారం ఇచ్చాం... తన్నుకు చావండి’ అన్న చందాన తయారైంది ఈ కౌలుదారీ రుణాల పంపిణీ కార్యక్రమం. జిల్లాలో లక్ష్యంగా పెట్టుకున్న రుణాలను పంపిణీ చేయలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతన్నలు ప్రైవేటు వ్యక్తుల నుంచి వడ్డీలకు తెచ్చుకుని రుణాలను తీసుకుని వ్యవసాయం సాగిస్తున్నారు.

అసలే ఖర్చులతో తడిసిమోపెడవుతున్న వ్యవసాయానికి ప్రైవేటు వడ్డీభారం మరింత తోడవుతోంది. దీనికితోడు పోటీ తత్వంతో భూయజమానులు కౌలు రేట్లు కూడా పెంచేశారు. దీంతో కౌలు రైతులు కుటుంబం గడవక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వ్యవసాయాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమన్న కాంగ్రెస్‌ నాయకులు కౌలు రైతులను మన జిల్లాలో కష్టాల నుంచి కాపాడాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే కౌలుదారీ రుణపత్రాలు పొందిన 4,127 మంది రైతులకు వెంటనే బ్యాంకుల నుంచి రుణాలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఓ వైపు ప్రతిపక్షాలు ప్రకటనలు జారీ చేస్తున్నా జిల్లా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి యంత్రాంగం దృష్టి సారించి కౌలు రైతులందరికీ బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు విఙ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో కాన్ఫరెన్సా...అయితే ప్రక్క జిల్లాకు పోవాల్సిందే!

నెల్లూరు  : పరిపాలనలో భాగంగా జిల్లా అధికారులు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఆయా విభాగాల కమిషనర్లు, కార్యదర్శులతో మాట్లాడడానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ సేవలు ఎపి స్వాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసారు. అత్యవసర సమావేశాలు, తుఫాను వంటి సమయాల్లో ఈ సదుపాయం ద్వారా వేగవంతంగా అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది.

అయితే కలెక్టరేట్‌లోని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రంలో ఏదో ఒక సాంకేతిక లోపంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు దాదాపు 10 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ఈ కేంద్రంలో క్లిష్ట సమయాల్లో రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నతాధికారులతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహించాల్సిన సమయాల్లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ప్రక్క జిల్లాలకు వెళ్ళ వలసి వస్తుంది. శుక్రవారం ఇటువంటి సందర్భాన్నే అధికారులు చవిచూసారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఒంగోలుకు వెళ్ళవలసి వచ్చింది.

మండలాల్లో అనుసంధానం కాని వీడియో కాన్ఫరెన్స్‌
వేగవంతమైన, సుపరిపాలన అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2009లో 23 జిల్లాలకు, 1088మండలాలకు, 5690 ప్రభుత్వ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించడానికి రూ.140 కోట్లు కేటాయించారు. హైదరాబాదు నుండి జిల్లా కేంద్రాలకు 8 ఎంబిపియస్‌, జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాలకు 2 ఎంబిపియస్‌ వేగంతో ఇటువంటి సదుపాయం కల్పించాలని సంకల్పించారు. కానీ, మండలాల్లో ఈ ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోనే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం సరిగ్గా లేనప్పుడు మండలాల్లో ఎట్లా ఉంటుందోనని కొందరు అధికారులు విమర్శిస్తున్నారు.
మండలాల్లో ఇంకా టెండర్లు పిలపలేదు - రమణయ్య, ఎపి స్వాన్‌ జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల నుండి మండలాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలనే నిర్ణయం నిజమే. కానీ మండలాల్లో టెండర్లు పిలవలేదు. సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రక్రియ అసంపూర్తిగా ఉంది.

ప్రజా నాయకుడు జగన్‌

నెల్లూరు : రాష్ట్రంలో ప్రజానాయకుడు వైఎస్‌ఆర్‌ మరణంతో ఆ లోటును తీర్చగల నాయకుడు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగల సమర్థుడు వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డేనని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌కు భయపడి కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల, మున్సిపల్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలను ఆపేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా చూపడం బాధ కలిగించిందని, మనస్తాపం చెందానని అందుకే ఎంపి పదవికి రాజీనామా చేశానన్నారు. వైఎస్‌ఆర్‌ మరణంతో రాష్ట్రంలో పాలన స్తంభించిపోయి ప్రజలు ఆ మహానేతను తలచుకుంటూ అల్లాడిపోతున్నారన్నారు. భజనపరుల మాట వినే కాంగ్రెస్‌ పార్టీ జగన్‌ను దూరం చేసుకుందని ఆయన కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శ చేశారు.


ఎంపి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి సోదరులు శనివారం నగరానికి విచ్చేసిన సందర్భంగా వారికి పార్టీ అభిమానులు, నేతలు, కార్యకర్తలు జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ఆ పార్టీ కార్యకర్తలు అయ్యప్పగుడి వద్ద నుండి గాంధీబొమ్మ వరకు భారీగా స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వారికంటే జగన్‌ ఎంతో అనుభవఙ్ఞుడైన ప్రజానాయకుడని ఆయన కొనియాడారు.


జగన్‌కు వస్తున్న ఆదరణ చూచి కాంగ్రెస్‌పార్టీ ఈ చర్యకు పూనుకుందన్నారు. వైఎస్‌ఆర్‌ లేని లోటు తీర్చగల వ్యక్తి జగనే అని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్‌ లక్షణాలు ఎవరికీ లేవని, అందుకే రాష్ట్ర ప్రజలు జగన్‌ను సమర్థిస్తున్నారన్నారు. అందుకు నిదర్శనమే కడప, పులివెందుల ఎన్నికలు అని అన్నారు. కడపలో వచ్చిన మెజారిటీని చూచి కాంగ్రెస్‌కు భయం పట్టుకుందన్నారు. జగన్‌ ఆదరణకు తట్టుకోలేకనే హైకోర్టు చెప్పకపోయినా వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఆర్‌లో ఇరికించారని, తండ్రి కొడుకులు నేరాలు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజల వద్దకు వెళ్ళి ఇచ్చిన మాట కోసం ఓదార్పు చేయడమే జగన్‌ చేసిన నేరమా? అని ప్రశ్నించారు.


ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న మహా నేత వైఎస్‌ఆర్‌ తనయుడు జగన్‌ను దోషులుగా చూపడంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగం చూపించారని, రైతులకు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, మహిళలకు పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పక్కా గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారని, ఇవన్నీ వైఎస్‌ఆర్‌ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే వైఎస్‌ఆర్‌ చేసిన తప్పా? అని రెండు పర్యాయాలు కాంగ్రెస్‌పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాసిన మహానేతకు గుర్తింపుగా కాంగ్రెస్‌ పార్టీ సిబిఐని ఉసిగొలిపి కేసులు పెట్టించి ప్రజల హృదయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఛీకొట్టించుకుంటుందన్నారు.


రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలను కలుసుకున్న వ్యక్తి జగనేనన్నారు. మీరు కోరుకున్నట్లుగా రాజీనామాలు చేశామని, దమ్ముంటే రాజీనామాలు చేసి మాతో పోటీకి సిద్ధ పడాలని పరోక్షంగా ఆనం సోదరులకు సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ బొమ్మతోనే ప్రజల వద్దకు వెళ్తాం. ఏ బొమ్మతో మీరు ప్రజల వద్దకు వెళ్తారు? మిమ్ములను ప్రజలు నమ్ముతారా... ఆ రోజులు పోయాయని ఆయన వ్యంగ్యంగా చమత్కరించారు.


రాజకీయ వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్న వ్యక్తి జగనే
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల దరికి చేరకపోవడంతో ఆ విషయాలను, రాజకీయ వాస్తవాలుగా ప్రజల వద్దకు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డేనన్నారు. నెల్లూరు ప్రజలు తెలివైన వారని, మహానేత వైఎస్‌ఆర్‌ నమ్మకాన్ని, ఆయన చూపిన ఆదరణను మరచిపోలేక, ఆయనపై వచ్చిన మచ్చను తట్టుకోలేక ఎంపి, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని జూపూడి ప్రభాకర్‌ పేర్కొన్నారు.


అంతకుముందు కన్వీనర్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ వెంట నడవాలని, వైఎస్‌ఆర్‌పై వచ్చిన మచ్చలను తుడిచివేయాలని, ఎంపి, ఎమ్మెల్యేలకు వైఎస్సార్‌ పార్టీ నేతలు త్యాగం చేసి రాజీనామాలు చేశారన్నారు. రెండున్నర సంవత్సరాల సమయమున్నా పదవులను త్యజించిన త్యాగమూర్తులన్నారు. ఆనాడు దేవుడు- నేడు దోషి, అదే కాంగ్రెస్‌ నీచ బుద్ధికి నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు జగనే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. దొంగతనం చేసిన దొంగ తప్పించుకునేందుకు దొంగ... దొంగ... అని అరుస్తారని, అందుకే చంద్రబాబు జగన్‌ను, వైఎస్‌ఆర్‌ను దొంగలుగా చెబుతూ ముందుగానే దొంగ దొంగ అని అరుస్తున్నారన్నారు.


ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పంచెకట్టు వైఎస్‌ఆర్‌కే అంకితమని, నీకు పంచెకట్టు అంతగా పనికిరాదని, దమ్ముండబట్టే మా నాయకులు రాజీనామాలు చేశారు. ధైర్యముంటే మీరూ రాజీనామాలు చేసి పోటీకి సిద్ధం కండి అని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి పద్మనాభరెడ్డి, యల్లసిరి గోపాల్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూర్యప్రకాష్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌లు ప్రసంగించగా స్థానిక నేతలు నగళ్ల కిరణ్‌కుమార్‌, బిసి చెన్నారెడ్డి, కలికి శ్రీధర్‌రెడ్డి, బాల చెన్నయ్య, పాపకన్ను శేఖర్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సా...అయితే ప్రక్క జిల్లాకు పోవాల్సిందే!

నెల్లూరు:పరిపాలనలో భాగంగా జిల్లా అధికారులు రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ఆయా విభాగాల కమిషనర్లు, కార్యదర్శులతో మాట్లాడడానికి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని కల్పించారు. ఈ సేవలు ఎపి స్వాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి రాష్ట్ర రాజధాని నుండి అన్ని జిల్లా కేంద్రాలకు అనుసంధానం చేసారు. అత్యవసర సమావేశాలు, తుఫాను వంటి సమయాల్లో ఈ సదుపాయం ద్వారా వేగవంతంగా అధికారులు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది.

అయితే కలెక్టరేట్‌లోని ఈ వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రంలో ఏదో ఒక సాంకేతిక లోపంతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు దాదాపు 10 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే ఈ కేంద్రంలో క్లిష్ట సమయాల్లో రాష్ట్ర రాజధానిలో ఉన్న ఉన్నతాధికారులతో జిల్లా అధికారులు సమావేశాలు నిర్వహించాల్సిన సమయాల్లో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా ప్రక్క జిల్లాలకు వెళ్ళ వలసి వస్తుంది. శుక్రవారం ఇటువంటి సందర్భాన్నే అధికారులు చవిచూసారు. పౌరసరఫరా శాఖ అధికారులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం లేకపోవడంతో ఒంగోలుకు వెళ్ళవలసి వచ్చింది.

మండలాల్లో అనుసంధానం కాని వీడియో కాన్ఫరెన్స్‌
వేగవంతమైన, సుపరిపాలన అందించే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2009లో 23 జిల్లాలకు, 1088మండలాలకు, 5690 ప్రభుత్వ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించడానికి రూ.140 కోట్లు కేటాయించారు. హైదరాబాదు నుండి జిల్లా కేంద్రాలకు 8 ఎంబిపియస్‌, జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాలకు 2 ఎంబిపియస్‌ వేగంతో ఇటువంటి సదుపాయం కల్పించాలని సంకల్పించారు. కానీ, మండలాల్లో ఈ ప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోయింది. జిల్లా కేంద్రంలోనే వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం సరిగ్గా లేనప్పుడు మండలాల్లో ఎట్లా ఉంటుందోనని కొందరు అధికారులు విమర్శిస్తున్నారు.
మండలాల్లో ఇంకా టెండర్లు పిలపలేదు - రమణయ్య, ఎపి స్వాన్‌ జిల్లా ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల నుండి మండలాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించాలనే నిర్ణయం నిజమే. కానీ మండలాల్లో టెండర్లు పిలవలేదు. సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ ప్రక్రియ అసంపూర్తిగా ఉంది.

సాంకేతిక పరిజ్ఞానం విశిష్టత ప్రజలకు చేరువ కావాలి

నెల్లూరు :సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు మరింత చేరువ కావాలని, దాని ఉపయోగం అన్ని రంగాల్లోను వినియోగించుకోవాలని శనివారం విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇంచార్జి ఉప కులపతి ఆచార్య ఎన్‌. ప్రభాకరరావు అన్నారు. ఈ జాతీయ సదస్సును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆర్ధిక సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. 2 రోజుల జాతీయ కాన్ఫరెన్స్‌ను ఉప కులపతి ఘనంగా ప్రారంభించారు. రాష్ట్రం, దేశం నలుమూలల నుండి 90కి పైగా ఔత్సాహిక పరిశోధన విద్యార్ధులు, అధ్యాపకులు తమ పరిశోధన పత్రాలను సదస్సుకు పంపించారు. ఈ 2 రోజుల జాతీయ సదస్సులో సమాచార, ప్రచార మాధ్యమాలు వ్యవస్థ భధ్రతా వ్యవ స్థలకు సంబంధించి చర్యలు, ఉపయోగకరమైన సంవాదాలు జరుగుతాయని తెలిపారు.

కంప్యూటర్‌ విభాగం 5వ జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించి ఈ ప్రాంతంలో విద్యా సంబంధమైన, పరిశోధనా రంగంలో మంచి చైతన్యం కలిగించిందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆచార్య నారాయణరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాన్ని ప్రశంసిస్తూ వారు ప్రతిసారి నూతనమైన విషయాల మీద సదస్సులు నిర్వహించి మంచి చైతన్యానికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య ఎంవి. రమణమూర్తి ముఖ్య ప్రసంగీకులుగా తన ప్రసంగ పాఠాన్ని అందిస్తూ సాంకేతిక పరిజ్ఞానం కాలానుగుణంగా వచ్చే మార్పులకు ధీటుగా రుపుదిద్దాలని, సాంకేతికత మరింత చౌకగా, ఆధారపడేదిగా ఉండాలన్నారు. అంతకుమునుపు ఆచార్య టి. సుధ సదస్సుకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ సదస్సు ముఖ్య ఉద్యేశ్యాలు ప్రకచించారు. ఆమె ఈ సదస్సులో రానున్న 2 రోజుల్లో జరగబోయే సైబర్‌ థ్రెట్‌ అనాలసిస్‌, వైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ సెక్యూరిటీ, జిఐఎస్‌ భధ్రతా వ్యవస్థలాంటి ముఖ్యమైన విషయాలపై చర్చ జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కె. నరసింహారావు అతిథులను సదస్సులో పాల్గొన్న ఔత్సాహికులను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకులు, యూనివర్సిటీ పీజీ సెంటర్‌ కావలి స్పెషల్‌ ఆఫీసర్‌ పి. శివశంకర్‌, విద్యార్ధులు పాల్గొన్నారు.

పగటి ఘరానా దొంగ అరెస్ట్‌

నెల్లూరు (క్రైం) మేజర్‌న్యూస్‌:నగరంలో పట్టపగలు ఇంటికి తాళం వేసివున్నా, వేయకపోయినా అదును చూసి చోరీలకు పాల్పడే ఓ ఘరానా దొంగను సిసిఎస్‌ పోలీసులు గురువారం వేదాయపాళెం రైల్వేస్టేషన్‌లో అరెస్ట్‌ చేశారు. శుక్రవారం ఈ దొంగను మీడియా ముందు ప్రవేశపెట్టి డిఎస్‌పి రవికుమార్‌ వివరాలను తెలియజేశారు. నగరంలోని డైకస్‌రోడ్డు ఎన్‌బిటి కాలనీకి చెందిన ఎస్‌డి.సూద్‌ అనే యువకుడు వృత్తిరీత్యా బంగారు పనిచేస్తూ, ప్రవృత్తి రీత్యా చోరీలకు పాల్పడుతూ నగరంలోని ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపించాడని నగర ఇన్‌చార్జ్‌ డిఎస్‌పి రవికుమార్‌ తెలిపారు. నగరంలోని బివి.నగర్‌, జగజ్జీవన్‌రాంనగర్‌, గాదం రోశయ్యనగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ వంటి పలు ప్రాంతాలలో గత నెలరోజులుగా చోరీలకు పాల్పడుతూ ఇంటి తాళాలు బద్దలుకొట్టి బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ దొంగ వద్ద నుంచి మొత్తం రూ.3 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ పగటి దొంగను పట్టుకోవడంతో సిసిఎస్‌ సిఐ సురేష్‌కుమార్‌, 3వ, 5వ నగర క్రైం ఎస్‌ఐలు బాబురావు, కృష్ణయ్యలు, క్రైం కానిస్టేబుళ్లు రవిచంద్రకుమార్‌, సిరాజ్‌, శిఖామణి, వెంకటేశ్వర్లు చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు. వీరిని జిల్లా ఎస్‌పి బివి.రమణకుమార్‌ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు తెలిపారు.

Saturday, August 27, 2011

ఇక బహిరంగ సభలతో చిరంజీవి తడాఖా, తొలుత విశాఖ

నెల్లూరు: విశాఖపట్నంలో వచ్చే నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహణకు కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీన్ని భారీగా నిర్వహించాలని తలపెట్టారు. కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం నాయకులే ఈ బాధ్యతను తీసుకున్నారు. ప్రజారాజ్యం శ్రేణులు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌లో విలీనమయ్యేలా చూసేందుకు దీనిని తలపెట్టారు. విశాఖపట్నం సమీప నియోజకవర్గాల నుంచి ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సభకు చిరంజీవితోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హాజరవుతారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరిజిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని చెబుతున్నారు. ఆ తర్వాత మరో రెండు ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత రెండు వారాలకు గుంటూరులో అదే స్థాయిలో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కోసం దీనిని ఉద్దేశిస్తున్నారు. ఆపై రాయలసీమ జిల్లాల కోసం అనంతపురం లేదా కర్నూలుల్లో మరో సభ జరుపుతారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స నివాసంలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో సీనియర్‌ నేతలు గంటా శ్రీనివాసరావు, కోటగిరి విద్యాధరరావు, వేదవ్యాస్‌, సుబ్బరాయుడు, కామినేని శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
పార్టీ పదవుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో నియమించాల్సిన నాయకులు, సీనియర్‌ కార్యకర్తల జాబితాను ఇవ్వాలని బొత్స వీరిని కోరారు. వారంరోజుల్లో పీసీసీ, డీసీసీల పునర్‌వ్యవస్థీకరణ చేపడుతున్నానని వాటిలో ప్రరాపాలో పనిచేసిన వారిని వారి స్థాయినిబట్టి సర్దుబాటు చేస్తానని బొత్స వారికి వివరించారు. నామినేటెడ్‌ పదవులు ఇవ్వాల్సిన వారి జాబితాను ముఖ్యమంత్రికి అందించాలని నిర్ణయించారు.
 

Friday, August 26, 2011

ఒంటరిగా ఉన్న మహిళా న్యాయవాదిపై కత్తితో దాడి

నెల్లూరు: ఓ మహిళా న్యాయవాదిపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో గురువారం చోటు చేసుకుంది. కావలిలోని వెంగళరావు నగర్‌లో ఉంటున్న రాధమ్మ అనే మహిళా న్యాయవాదిపై గురువారం ఉదయం కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. కత్తితో తీవ్రంగా గాయపర్చారు. ఆమె మెడలోని 60 గ్రాముల బంగారం, నగదు ఎత్తుకు పోయారు. ఇంట్లో ఇంకా ఏమైనా విలువైనవి ఉన్నావో చూసేందుకు ఇళ్లంతా చెల్లాచెదురు చేసి వెళ్లిపోయారు.


ఉదయం రాధమ్మ రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆమెను వెంటనే దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. రాధమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. భర్త లేడు. దీంతో వచ్చిన వారు కేవలం దొంగతనానికే వచ్చారా? లేక మరో కారణం ఏమైనా ఉందా? న్యాయవాది కావడంతో కేసుల విషయంలో ఘర్షణ కారణంగా హత్యా ప్రయత్నం చేశారా? అనే కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. రాధమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

రాజీనామాలపై తగ్గేది లేదు: జగన్ ఎమ్మెల్యే మేకపాటి

నెల్లూరు : వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజీనామాలకు కట్టుబడి ఉన్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి గురువారం అన్నారు. రాజీనామాలపై ఎవరూ వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజీనామాలు చేసిన వాళ్లమంతా నూటికి నూరునూరు శాతం కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ రాజీనామాలు ఖచ్చితంగా ఆమోదించుకుంటామని చెప్పారు. కాంగ్రెసు పార్టీ మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్‌కు వస్తున్న ప్రజాధరణ తట్టుకోలేకే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయన్నారు.


ఆయన శక్తిని ఎవరూ ఆపలేరన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెసు, టిడిపిలు రాష్ట్రంలో తుడిచి పెట్టుకు పోవడం ఖాయమన్నరు. వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారి కుట్రలను ప్రజలకు తెలియజేయడానికి త్వరలో బస్సుయాత్ర చేపడతామని చెప్పారు. కాంగ్రెసు బాబు ఉచ్చులో పడిపోయిందన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు ఎవరూ స్పందించడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ప్రభుత్వం అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.

బొత్స సత్యనారాయణపై వైయస్ జగన్ వర్గం ఎదురుదాడి

నెల్లూరు : ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేస్తే ఎవరు అవినీతిపరులో తెలుస్తుందని వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారన్న బొత్స వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఎవరు నిజాయితీపరులో తెలియాలంటే బొత్స రాజీనామా చేసి ప్రజాకోర్టుకు రావాలన్నారు. రాజీనామాలు చేసిన వారు ఎవరూ వెనక్కి వెళ్లరన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే ముందు రాజీనామాలు ఆమోదించాలని సవాల్ విసిరారు.


దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బొమ్మ మీద గెలిచిన మంత్రులు రాజీనామా చేయాలన్నారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తుంది బొత్సనే అన్నారు. తాము ఎవరి ప్రలోభాలకు లొంగేది లేదన్నారు. అవినీతిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోరాటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తమకు పదవి ముఖ్యం కాదని వైయస్సార్, జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమమన్నారు. కాంగ్రెసు పార్టీ చీఫ్ విప్ కొండ్రు మురళీ వ్యాఖ్యలపై జగన్ వర్గం నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళీ త్వరలో తమ పార్టీలోకి వస్తారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.


కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి సైతం కొండ్రు వ్యాఖ్యలను ఖండించారు. జగన్ ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు కట్టుబడి ఉన్నారన్నారు. రాజీనామాల కోసం ఎవరినీ బలవంతం చేయలేదన్నారు. అందరూ సొంతగానే రాజీనామాలు చేశారన్నారు. ఎమ్మెల్యేల రాజీనామా విషయం జగన్‌కు సైతం తెలియదన్నారు. ఎమ్మెల్యేలను తప్పుదారి పట్టించడానికే కొండ్రు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు

జగన్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫోన్ చేస్తున్నారు: ఆనం

నెల్లూరు : దివంగత వైయస్ పేరు ఎఫ్ఐఆర్‌లో ఉన్నందున రాజీనామా చేశామని చెబుతున్న వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫోన్ చేసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. వైయస్ జగన్, ఆయన వర్గం నేతలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను రోడ్డు పైకి ఈడుస్తున్నారని విమర్శించారు.


జగన్ ఆస్తుల పైన జరుగుతున్న సిబిఐ దాడుల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. వారు తమ రాజీనామాలను స్పీకర్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. సిబిఐ దర్యాఫ్తును ఆపేందుకు రాజీనామాల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆస్తులపై విచారణ జరిగి నిజాలు తెలియాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాజీనామాలు చేసిన కొందరు ఎమ్మెల్యేలకు జగన్‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని విమర్శించారు. జగన్ పక్కనే ఆయన అనుకూల శతృవులు ఉన్నారన్నారు.

ఎంపీ పదవికి మేకపాటి రాజీనామా

నెల్లూరు: నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో ఏక వాక్యంతో ఆయన తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు సమర్పించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చటం వల్లే తాను రాజీనామా చేసినట్లు తెలిపారు.

ఈ విషయంలో తానే కాదని, రాష్ట్ర ప్రజలు కూడా మనస్తాపం చెందారన్నారు. రాజీనామాల ద్వారా తమ నిరసనలు తెలిపామని మేకపాటి అన్నారు. నిస్సహాయంగా ఉన్నారని భావించే ఆరోపణలు చేస్తున్నారన్నారు. జగన్ సీఎం కావాలని సంతకాలు చేసినవారే తర్వాత దూరం అయ్యారని ఆయన గుర్తు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన జనం మాత్రం జగన్ వెంటే ఉంటారన్నారు. ధర్మం ఉంది కాబట్టే జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలికానని మేకపాటి అన్నారు. తన రాజకీయ జీవితమంతా రహదారేనని, ఎత్తులు, జిత్తులు లేవని ఆయన తెలిపారు

రాజకీయ, సమాజిక మార్పుకు యువత కృషి చేయాలి

నెల్లూరు  : యువతకు దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థలపై అవగాహన ఉండాలని, ఈ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో యువకులు ప్రధాన పాత్ర పోషించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్‌) ఆధ్వర్యంలో స్థానిక రామకోటయ్య భవన్‌లో ఆదివారం కోస్తాంధ్ర యువజన సమాఖ్య కార్యకర్తల విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను నారాయణ ప్రారంభించారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఈ అవినీతి కుళ్ళి కంపుకొడుతున్న దశలో 75 సంవత్సరాల అన్నాహజారే దీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని నారాయణ అన్నారు. దేశ భద్రత విషయంలో వీర జవానులకు ఇళ్ళు నిర్మించి ఇవ్వడంలో కూడా పాలకులు అవినీతికి పాల్పడ్డారని, ప్రతిదీ అవినీతిమయమైన ప్రస్తుత తరుణంలో యువకులు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాలలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని వనరులు, ప్రకృతి సంపద మన దేశంలో ఉన్నాయని, సారవంతమైన పొలాలు, నిష్ణాతులైన డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్‌లు, మేధావులు ఉన్నప్పటికీ దేశం అవినీతితో అనుకున్న ప్రగతి సాధించలేకపోతున్నదని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్విస్‌బ్యాంకులో మన దేశ సంపద అంతా దాచివుందని, ఈ డబ్బును బయటకు తీస్తే దేశంలో ప్రతి గ్రామాభివృద్ధికి రూ. 600 కోట్లు నిధులు కేటాయించవచ్చునని అన్నారు. అన్నాహజారేకి ముందే అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు దేశంలోనూ, పార్లమెంటులోనూ పోరాటం చేశాయని, అనేక అక్రమాలు బయటపెట్టాయని, అయితే ప్రచార సాధనాలు వాటికంత ప్రాధాన్యత ఇవ్వనందున అవి ప్రజలలోకి వెళ్ళలేదని నారాయణ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ దివాళాకోరుతనం వల్లనే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయని, కాంగ్రెస్‌పార్టీ నేతలు తెలంగాణాలో ఒక మాట, కోస్తాంధ్రలో మరో మాట మాట్లాడుతున్నా, పార్టీ హై కమాండ్‌ ఈ నేతల మాటలను సమర్ధిస్తున్నదని ఇందువల్లే తెలంగాణా సమస్యగా మారిందన్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, ఇందుకు వ్యతిరేకంగా యువకులు పోరాటం సాగించాలని నారాయణ పిలుపునిచ్చారు.

Tuesday, July 26, 2011

దేశ ద్రోహులకు రాజ భోగాలు......

నెల్లూరు,  ప్రతినిధి:భారతీయులు ఉలిక్కి పడేలా, తలచుకుంటేనే భయభ్రాంతులకు గురఇయ్యే హైదరాబాద్‌లోని గోకుల్‌ చాట్‌ బాంబు పేలుడు ముద్దాయిలుగా దేశద్రోహులుగా గుర్తించబడిన వారికి జిల్లా కేంద్రకారాగారంలో ఇటీవల రాజభోగాలు అందుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. చెమటోడ్చి కష్టపడి పోలీసులు పట్టుకొని దేశద్రోహులుగా ముద్రించి చర్లపల్లి జైలు నుంచి నెల్లూరు జైలుకి తరలిస్తే ముడుపులకు ఆశపడి ఇక్కడ కొంతమంది అధికారులు సిబ్బంది ఆ కఠినాత్ములకు రాచమర్యాదలు చేయడం సభ్యసమాజం తలదించుకొనేలా వుందని పలువురు వాపోతున్నారు. చూడటానికి నిర్మలంగా ఉండే జియాఉల్‌ హుక్‌, ఆలీభాయి, సిరాజుద్దున్‌, ఖ్రుషీలు అతి సులువుగా ప్రాణాలు తీయడంలో దిట్టలే గాక బాంబు పేలుళ్ళు ప్రణాళిక చేయడంలో రాక్షసులు. 


ఇలాంటి దేశద్రోహులకు ఎంత శిక్ష వేసినా సరిపోదు అలాంటి వారిని వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరినొకరు మాట్లాడకుండా చేయాల్సింది పోయి వారు కలసిమెలసి వుంచడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. కేవలం ఉగ్రవాదులకు సంబంధించిన వారు అధికారులకు, సిబ్బందికి భారీ మొత్తంలో ముడుపులు అందించడం వల్లనే ఈ దేశద్రోహులను స్వేచ్ఛగా వుంచుతున్నారని జైలులోని కొంతమంది గుసగుసలాడుతున్నట్టుగా సమాచారం. దీనికి తోడు ఏకంగా కారాగారంలోని ఉగ్రవాదులకు ఉగ్రవాద సాహిత్యంకు సంబంధించిన పుస్తకాలు అందుతున్నాయని వినికిడి.


అంతేగాక ఇటీవల జరిగిన ముంబాయి దాడులుకు సంబంధించిన చర్చలును సెల్‌ఫోన్‌లు ద్వారా ఈ ద్రోహులు ఇక్కడినుండే చర్చలు చేసినట్టుగా తెలిసింది. ఇటువంటి కఠినమైన కర్కశులకు మన కేంద్రకారాగారంలో కొంతమంది సహకరించడం శోచనీయమని పలువురు భావిస్తున్నారు. కేవలం డబ్బులకు ఆశపడి ఖైదీ ఎలాంటి వాడన్న సంగతికూడా మరచి వైద్యం అవసరం లేకపోయినా వారిని ప్రభుత్వ వైద్యశాలకి పంపడమే కాక వారికి ఎలాంటి అనారోగ్యం లేకపోయినా వారికి ఆనారోగ్యంగా ఉందని వారికి విశ్రాంతి అవసరమని చెబుతూ ధృవీకరించేటట్టుగా అటు వైద్యులు ఇటు జైలు సిబ్బందిలు కుమ్మక్కుకావడం నిత్యకృత్యం అయింది. అయితే ఇంత జరుగుతున్నా నిఘా విభాగం దీని గురించి పట్టించుకోకుండా కేవలం రాజకీయ నాయకులకు అవసరమైన సమాచారాన్ని అందించే శాఖగానే మిగలడం హాస్యాస్పదం. ఎంతోమందిని బాంబు పేలుళ్ల ద్వారా చంపిన ఇలాంటి కిరాతకులకు రాజభోగాలు కనిపించకుండా, కారాగారంలో బాధలే కనపడాలి, ఈ తప్పు ఎందుకు చేశానా అని కుమిలి కుమిలి చచ్చేటట్టుగా చేయాల్సిన అవసరం ఎంతైనావుంది.

Saturday, July 9, 2011

కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి మార్చుకోవాలి లేదంటే తీవ్ర పరిణామాలు

నెల్లూరు  :కేద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ఏకపక్ష తీర్మాణం చేస్తే సీమాంధ్రలో తీవ్ర పరిణామాలు తప్పవని సమైక్యాంధ్ర విద్యార్ధి జె ఎసి హెచ్చరించింది. శుక్రవారం నగరంలోని చిల్డ్రన్స్‌ పార్కు సమీపంలో గల జాతీయ రహదారిపై జెఎసి మానవహారంగా ఏర్పడి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. జెఎసి రాష్ట్ర కో-కన్వీనర్‌ డివి. కృష్ణయాదవ్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరి వలన వేర్పాటు వాదుల స్వార్ధ ఉద్యమాలకు ఈ రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ప్రభుత్వం తలకిందుల నిర్ణయాలను ఇప్పటికైనా కట్టిపెట్టి వేర్పాటువాద ఉద్యమాలకు చరమగీతం పలకాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

సీమాంధ్రులు కట్టే పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటూ సహాయ నిరాకరణ చేస్తామని తెలంగాణ ఉద్యోగ జెఎసి పేర్కొనడంలో అర్ధం లేదన్నారు. జీతాలు తీసుకోకుండానే ఉద్యమాలు చేయాలని వారికి సూచించారు. ప్రభుత్వంపై బ్లాక్‌మెయిలింగ్‌ ప్రకటనలు చేస్తున్న తెలంగాణా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొని ప్రభుత్వం వారిని విధుల నుండి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై ఏకపక్ష తీర్మాణం చేస్తే సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. దీనిపై మరో వారంలోపు 14 యూనివర్సిటీల విద్యార్ధి జెఎసి ప్రతినిధులు విశాఖపట్నంలో సమావేశమై ఉద్యమాల తీవ్రత పెంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెఎసి కన్వీనర్‌ ఆచార్య ఆదిత్య, టోనిబాబు, ఆదిత్య సాయి, అనిల్‌, చరణ్‌ తదితర జెఎసి నాయకులు పాల్గొన్నారు.

Friday, June 3, 2011

మున్సిపాలిటి వద్దు - నగరపాలకం ముద్దు

నాయుడుపేట‌: జిల్లాలో మేజర్‌ పంచాయతీగా ఉన్న నాయుడుపేట పంచాయతీని నగరపాలక టౌన్‌ పంచాయతీగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక పంచాయతీ పాలక వర్గం తీర్మానించింది. ఇటీవల జరిగిన పంచాయతీ సమావేశంలో మున్సిపాలిటిపై చర్చ జరిగింది. మేజర్‌ పంచాయతీలను మున్సిపాలిటిలుగా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నందున పాలకవర్గం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలన్న దానిపై స్పందించిన పాలక వర్గం మున్సిపాలిటిగా మార్చితే పట్టణంలోని రోడ్ల అక్రమణలతో పాటు సందు గొందులలో ప్రభుత్వ స్థలాలు, రోడ్లు ఆక్రమణల తొలగింపు జరగడమేకాక ఇంటి పన్నుతో పాటు కోళాయి వ్యాపారం పన్నులు అధికంగా పెరగుతాయి.

అంతేకాకుండా మున్సిపాలిటిగా తీర్మాణం చేస్తే పాలక వర్గంపై ప్రజల్లో ఒక రకమైన ఆందోళన, ఆలోచనలు ఏర్పడుతాయన్న భావనలు లేకపోలేదు. దానికి తోడు పాలక వర్గం నాయకులకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు దెబ్బతగులుతుందన్న భయం కూడా ఉంది. పట్టణ ప్రజల అభివృద్ధి దృష్ట్యా మున్సిపాలిటి తిర్మాణానికి వెనుకడుగు వేసినట్లు కనబడుతుంది. పంచాయతీ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు మున్సిపాలిటిలు వచ్చే విధంగా నిధులు విడుదలవ్వాలంటే నగరపాలక టౌన్‌ పంచాయతీగా మార్పు చేయాలని పంచాయతీ తీర్మానించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.

నగరపాలక టౌన్‌ పంచాయతీగా మార్పు చేస్తే మున్సిపాలిటిల వలే పరిపాలన కొనసాగుతుందని ఈవోకు బదులు కమీషనర్‌ అధికారిగా ఉంటారు. పరిపాలన విభాగం మొత్తం మున్సిపాలిటీ వలే జరుగుతుంది. నగర పాలక టౌన్‌ పంచాయతీగా ఉంటే పన్నుల పెంపు అక్రమణల తొలగింపు లాంటి వాటిపై ఒత్తిడి ఉండదు. అదే మున్సిపాలిటి అయితే తప్పనిసరి పై సమస్యలపై ప్రభుత్వ చర్యలు ఉంటాయి. ఈవన్నీ దృష్టిలో ఉంచుకొని రాజకీయ అంశాలను పరిగణంలోకి తీసుకొని ప్రస్తుత పాలక వర్గం నగరపాలక టౌన్‌ పంచాయతీ మార్పుకు మొగ్గు చూపింది. పంచాయతీ పాలక వర్గం తెదేపాకు చెందినది అయినందున కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆ పార్టీ స్థానిక నాయకులు పంచాయతీ తీర్మాణానికి మద్దుతు పలుకుతారో లేక మున్సిపాలిటి మార్పుకు ప్రాధాన్యత ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

వచ్చే ఎన్నికల్లో జగన్‌దే ప్రభంజనం

కావలి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనంలో మిగిలిన రాజకీయ పార్టీలు కొట్టుకుపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మహానేత వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ఒక్క యువనేత జగన్ వల్లే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, శివకుమార్‌రెడ్డి, కుందుర్తి కామయ్య, ప్రసాద్‌రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డేవిడ్, పద్మనాబరెడ్డి, రామచంద్రారెడ్డి, తుమ్మలకోటారెడ్డి, సాయి, సర్పంచులు కొండారెడ్డి, జంపాని రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

మసీదు స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వం

నెల్లూరు : జామియా మసీదుకు చెందిన స్థలాన్ని అన్యాక్రాంతం కానివ్వబోమని మసీదు వక్ఫ్ మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్ ఆసిఫ్‌బాషా పేర్కొన్నారు. నగరంలో శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో శిఖరంవారివీధిలోని జామియా మసీదుకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయన్నారు. అందులో కొంత భాగం అన్యాక్రాంతమైందన్నారు. నగర శివారులో మనుమసిద్దినగర్ లేఅవుట్‌కు ఆనుకొని ఉన్న 117, 118, 119, 120, 121 సర్వే నంబర్లలో 13.33 ఎకరాల భూమి వక్ఫ్‌బోర్డ్ పర్యవేక్షణలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉందన్నారు.

గతంలో ఆర్కాట్ నవాబు జామియా మసీదులో నమాజ్ విధులు నిర్వహించేందుకు ఆ భూమిని కేటాయించారన్నారు. ఆ భూమిలో వచ్చే ఫలితాన్ని ముత్తవల్లి జుబీదాబేగం పూర్వీకులు నమాజ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారన్నారు. వారికి ఆ భూమిని అమ్మేందుకు ఎటువంటి అధికారం లేదన్నారు. 10 సంవత్సరాల క్రితం మసీదుకు చెందిన 3.5 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందన్నారు. కొన్నేళ్లుగా అసాంఘికశక్తులు, మసీద్ భూమిని స్వాహా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో షేక్.సంధానిబాషా సయ్యద్, షకీల్ అహ్మద్, సయ్యద్‌ఖాదర్‌బాషా, షేక్, షబ్బీర్, షేక్, మున్నీర్‌బాషా, సయ్యద్ సలార్, తదితరులు పాల్గొన్నారు.

హస్తినకు పయనమైన నేతలు

నెల్లూరు : జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు హుటాహుటిన శుక్రవారం రాష్ట్ర రాజధానికి పయనమయ్యారు. శనివారం ఉభయ సభలు సమావేశం కానున్నాయి. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను ఎన్నుకునేందుకు ఉభయసభలూ ప్రత్యేకంగా సమావేశ పరుస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అన్ని పార్టీల నేతలూ వ్యూహ రచనలో తలమునకలయ్యారు. దీంతో జిల్లా నుంచి అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారిన నేపథ్యంలో ప్రజాప్రనిధులు వెంట ద్వితీయ శ్రేణి నేతలు కూడా రాజధానికి వెళ్లారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో కొందరు జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి వెళ్లగా, సొంత పనుల నిమిత్తం తిరుపతి, బెంగళూరు, చెన్నైలలో ఉన్న మరి కొందరు నేతల కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

జిల్లాకు చెందిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. పార్టీ సమావేశాల దృష్ట్యా హైదరాబాద్‌కు వెళ్లి శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్, జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం హుటాహుటిన రాష్ట్ర రాజధానికి వెళ్లారు. ఆయన రేణిగుంట నుంచి విమానంలో వెళ్లారు. సరేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి మూడురోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్నారు.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కలిసి రేణిగుంట నుంచి విమానంలో వెళ్లారు. గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్ ‘సింహపురి’ రైలులో వెళ్లారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా వెంకటరత్నం గురువారం రాత్రి తిరుపతి నుంచి వోల్వో బస్సులో బయలుదేరి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం చెన్నై నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం గురువారం ఖమ్మం పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఉదయానికే రాజాధానికి చేరుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి శుక్రవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

జగన్ కనె్నర్ర చేయాలి ప్రభుత్వాన్ని పడగొట్టాలి

పొదలకూరు : కనె్నర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని, తన దయాదాక్షణ్యాలపైనే ప్రభుత్వం ఉందంటూ చెప్పుకునే జగన్ అన్న మాటపై నిలబడాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో గత ఏడేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై తెలుగుదేశం పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో థర్మల్ ప్రాజెక్టుల కాలుష్యంపై , వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తున్నామన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల కార్యకర్తలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. మండల టిడిపి అధ్యక్షుడు వెంపులూరు పుల్లయ్యగౌడ్, మండల టిడిపి నాయకులు టి రఘురామిరెడ్డి, సుబ్బరామనాయుడు, షేక్ చాంద్‌బాషా తదితరులు ఈ కార్యిక్రమంలో పాల్గొన్నారు.

మేకపాటికి ఇరకాటం.. ప్రసన్నకు తప్పనున్న గండం అవిశ్వాస తీర్మానంపై జిల్లాలో చర్చోపచర్చలు

నెల్లూరు: అసెంబ్లీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధం కావడంతో జిల్లాలోని వైఎస్సార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి ఇరకాటంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ పార్టీలోకి వెళ్లిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డికి వెసులుబాటు దొరికింది. జగన్ విసిరిన సవాలుకు సమాధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత అవిశ్వాస తీర్మానానికి సిద్ధమై స్పీకర్‌కు నోటీసు కూడా ఇచ్చారు. దీనితో తీర్మానంపై ఓటింగ్‌పై జిల్లాలో చర్చ మొదలయింది. జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేలు ఎవరు ఎవరికి ఓటేస్తారనే విషయంలో ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ ఆ పార్టీకి మద్దతుగా ఉన్నప్పటికీ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అధికారికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేస్తే ఈ ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం చర్చనీయాంశమయింది. మొదటి నుండి ఆయన జగన్‌కు అనకూలంగానే మాట్లాడుతున్నారు. జగన్ కోసం అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పలుసార్లు ప్రకటించారు. కానీ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తే ఆయన పదవికి ఎసరు వస్తున్న నేపథ్యంలో ఎలా ప్రశ్నార్ధకంగా మారింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అదే వైఎస్సార్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసినప్పటికీ ఆయనకు ఎలాంటి సమస్య వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లే పరిగణలోకి వస్తుంది. దీనితో ఆయన ఇటు వైఎస్సార్ పార్టీకి అటు తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగించినట్లవుతుంది

మృతుల కుటుంబాలకు మంత్రి ఆనం పరామర్శ

రాపూరు : ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాశీ యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అశువులు బాసిన రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబీకులను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరామర్శించారు. గురువారం జోరేపల్లికి వచ్చిన ఆయన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తలుపూరు సరోజనమ్మ కుటుంబీకులను పరామర్శించారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమెతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా మృతిచెందారు. ఈ నేపథ్యంలో రాపూరు మండల వాసులతో ఉన్న సుదీర్ఘ పరిచయాల నేపధ్యంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వీరి కుటుంబీకులను పరామర్శించారు. మంత్రి వెంట సైదాపురం ఎంపిపి రవికుమార్, రాపూరు ఈద్గా కమిటీ చైర్మన్ షేక్ ముక్తియార్ ఉన్నారు. ఈ పరామర్శ అనంతరం మంత్రి ఆనం మద్దెలమడుగు నాలుగు రోడ్ల కూడలిలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కొద్దిసేపు చర్చించారు. పర్యటనలో భాగంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రికి అందచేశారు. రాపూరు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని రెగ్యులర్ చేయాలని కోరుతూ పంచాయతీ సిబ్బంది అర్జీ అందచేశారు

Thursday, May 26, 2011

కాకాణికి పదవిపై నాయకుల హర్షం

కొడవలూరు:జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా కన్వీనర్‌గా నియమించడంపై కొడవలూరు జగన్‌ వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి, రాబోయే ఎన్నికల్లో గెలుపునకు కాకాణిని జిల్లా కన్వీనర్‌గా ఎంపిక చేయడం ఆయన సత్తాపై జగన్‌కు ఉన్న నమ్మకమేనన్నారు.అధికారపార్టీ టిడిపికి కడప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకుండా పోవడంపై జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌ మందిపాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జగన్‌ సత్తాను చాటుకున్నారన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలసికట్టుగా పనిచేస్తామన్నారు. విడవలూరు జడ్పీటిసి వీరి చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కడప ఎన్నికలు చర్చనీయాంశం అయినాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి జగన్‌మోహన్‌రెడ్దిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గండవరం ఎంపిటిసి మోహన్‌కృష్ణ, కొడవలూరు మండల సర్పంచ్‌లసంఘం అధ్యక్షుడు చిమటా శేషగిరి, నార్త్‌రాజుపాళెం ఉప సర్పంచ్‌ కొండా శ్రీనివాసులురెడ్డి, మైనారిటీ నాయకులు కరిముల్లా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

గుప్పెడు నీరు దొరికితే చాలు

ఉదయగిరి: మండల పరిధిలోని సున్నంవారిచింతలలో మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మంచినీరు లేక ఎక్కడికో వెళ్లవలసిన పరిస్థితి నెలకొందని ఆగ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మంచి నీటి ట్యాంకు వున్నా నీరు అసలు రావటంలేదని సుమారు 150 కుటుంబాలకు పైగా వున్నాయని వారానికి ఒక్కరోజుకూడా నీరు రావటంలేదని మంచి నీటి ట్యాంకు వున్నా ఫలితంలేకపోయిందని ఆగ్రామ ప్రజలు తెలిపారు. ఇక్కడ ఒకే బోరింగు వుండటంవలన నీరు చాలక గుప్పెడు నీటికోసం దూరప్రాంతాలనుంచి తీసుకొని వస్తున్నారని మంచినీరు దొరక్క ఒక బిందెనీరు రూ.10లకు కొంటున్నామని మామల్ని పట్టించుకునే నాధుడే లేడని ఎన్నిసార్లు అధికారుల దెగ్గరలు ఈవిషయంపై వెళ్ళిన ఫలితం లేకపోయిందని మారోడును ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాక అయోమయ స్థితిలో వున్నారని ప్రజలు ఆరోపించారు. మంచినీటి ట్యాంకు కట్టి ఏడాది దాటుతున్నా ప్రజలకు మంచినీరు అందించలేకపోతుందని ఆగ్రామస్థులు పేర్కొన్నారు.మంచినీటి కోసం నానాకష్టలు పడుతున్నారని ఇప్పటికైన సంబంధిత అధికారులు చలించి మంచినీటి ఎద్దడిని తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రాపూరులో గ్రామసేవకుల నిర్వదిక సమ్మె

రాపూరు: రాపూరు ప్రభుత్వ రెవిన్యూ కార్యలయంలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సేవకుల సమ్మె ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామసేవకుల సంఘం పిలుపుమేరకు బుధవారం రాపూరు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట 36 మంది గ్రామ సేవకులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా నెలసరివేతనం రూ.5వేలు, టిఎ, డీఎలు రూ.50ల నుండి రూ.100ల వరకు పెంచాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న గ్రామసేవకుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రస్తుతం గ్రామ సేవకులకు వేతనం రూపంలో నెలకు రూ.2500లు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

ఆశాకాన్నంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు ప్రభుత్వం చెల్లించే కొద్దిపాటి వేతనాలు సరిపోకపోవడంతో తమ కుటుంబాలు పస్తులు ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం హామీ ప్రకారం గ్రామసేవకులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. జీవో నంబర్‌ 1849 ప్రకారం గ్రామసేవకుల కుటుంబీకులకు వారసత్వంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో రాపూరు పట్టంలోని 21 పంచాయితీలకు చెందిన 36 మంది గ్రామసేవకులు పాల్గొన్నారు.

Sunday, May 8, 2011

బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ స్పష్టం

నెల్లూరు: ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల బాల బాలికలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను నూటికి నూరుశాతం అందించేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ తెలిపారు. శనివారం స్థానిక గోల్డెన్‌జూబ్లీ హాలులో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల పునః ప్రారంభం నాటికి బాలబాలికలందరూ పాఠశాలల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల రిసోర్స్‌పర్సన్లతో కలిసి అంగన్‌వాడీ వర్కర్లు, వయోజన విద్యా ప్రేరక్‌లు, సాక్షర భారత్ వాలంటీర్లు, మహిళా సమాఖ్యలు, యువజన సంఘాలు, గ్రామ సహాయకుల సహకారంతో 2011, మే 8వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు ప్రతి కుటుంబాన్ని సందర్శించి ఓటర్ల జాబితా ఆధారంగా 6-14 సంవత్సరాల వయస్సు కల్గిన బడిబయట పిల్లల వాస్తవ పరిస్థితులను సేకరించాలన్నారు. సేకరించిన వివరాలను నిర్దేశించిన నమూనాలలో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. జిల్లాలో బడికి దూరంగా ఉన్న 4241 మంది బడిఈడు పిల్లలను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 2289 మంది బాలురు, 1952 మంది బాలికలు ఉన్నారన్నారు. ప్రాథమిక విద్యాశాఖ నిర్వహించిన సర్వే వివరాలను బడిబాట సందర్భంగా గ్రామసభలలో సామాజిక తనిఖీల ద్వారా ధ్రువీకరించుకోవాలన్నారు.
‘బడీడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలి’
అదనపు జాయింట్ కలెక్టర్ టి సీతారామయ్య మాట్లాడుతూ రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖ అధికారులు సమన్వయంగా పనిచేసి బడికి దూరంగా ఉన్న బడిఈడు పిల్లందరినీ గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, మండల రిసోర్స్‌పర్సన్స్, తహశీల్దార్ల నుండి ఓటర్ల జాబితా ప్రతులను తీసుకుని వాటి ఆధారంగా సమగ్రంగా సర్వే నిర్వహించి బడికి దూరంగా ఉన్న బడిఈడు పిల్లలను గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్‌పి నాగేశ్వరరావు, రాజీవ్ విద్యామిషన్ పివో జలీల్‌బాషా, జిల్లా విద్యాశాఖాధికారి బాలకాశయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకటరమణారెడ్డి, ఐసిడిఎస్ పిడి శారద, మండల విద్యాశాఖాధికారులు, మండల రిసోర్స్‌పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బకు ముగ్గురు మృతి

నెల్లూర: జిల్లాలో శనివారం వడదెబ్బకు ముగ్గురు మృతి చెందారు. కలువాయ మండలంలో ఒకరు, మనుబోలు మండలంలో ఒకరు, చిల్లకూరు మండలంలో ఒకరు మృతిచెందారు.
కలువాయలో..
కలువాయి: కలువాయి గ్రామం సుసర్ల వీధిలో పాశం పెంచలయ్య (70) అనే వృద్ధుడు వడదెబ్బకు గురై మరణించాడు. శుక్రవారం వడదెబ్బకు తీవ్ర అస్వస్థతకు గురైన పెంచలయ్యను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించగా శనివారం ఉదయం మృతి చెందాడు.
మనుబోలులో..
మనుబోలు: మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో శనివారం సాయంత్రం పొలాల్లోకి వెళ్లిన రైతు వడదెబ్బకు గురై మృతి చెందాడు. కొమ్మలపూడి గ్రామానికి చెందిన మనె్నమాల కృష్ణారెడ్డి(60) శనివారం పొలాల్లోకి సొంత పనిమీద వెళ్లాడు. ఎండ వేడిమికి వడదెబ్బసోకి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు బంధువులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
చిల్లకూరులో..
చిల్లకూరు, మే 7: చిల్లకూరు మండలంలోని పల్లమాల గ్రామానికి చెందిన మారంరెడ్డి రామచంద్రారెడ్డి(54) శనివారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురై మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం పొలాల నుండి రామచంద్రారెడ్డి ఇంటికి వస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. శనివారం ఉదయం కోట ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

ఓటేద్దాం పదండి! పరుగులు తీసిన కడప విద్యార్థులు, ఓటర్లుజగన్, విజయమ్మల గెలుపుపై ఎంపి, జడ్పీ చైర్మన్ ధీమా

నెల్లూరు: కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆదివారం జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అక్కడ నుండి వలస వచ్చిన జనం శనివారం రాత్రి కడపకు బయలు దేరి వెళ్లారు. కడప నుండి వచ్చి ఇక్కడ చదువుతున్న విద్యార్థులు వేలల్లో ఉన్నట్లు అంచనా. వీరంతా శనివారం మెస్ భోజనాలు ముగించి బస్సుల్లో వివిధ వాహనాల్లో కడప జిల్లాకు బయలుదేరి వెళ్లారు. విద్యా సంస్థల యాజమాన్యం వారిస్తున్నా విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకోవాలనే పట్టుదలతో వెళ్లినట్లు వారికి బయట భోజన సౌకర్యం కల్పిస్తున్న మెస్ యజమానులు తెలిపారు. అలా వెళ్లిన వారిలో 60 శాతం మంది జగన్, విజయమ్మల వైపు మొగ్గు చూపుతున్నట్లు మెస్ యజమానులు తెలిపారు. ఓటు లేని కొందరు విద్యార్థులు జగన్ విజయంలో పాలుపంచుకునే అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు బుజబుజ నెల్లూరుకు చెందిన మల్లికార్జున టెలీలింక్ సర్వీసు యజమాని తెలిపారు. కడపలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిసి బ్యాగులు, సరంజామా వదిలేసి కేవలం కట్టుబట్టలతో ఓటేయడానికి బయలుదేరారని చెప్పారు. ఓటున్న విద్యార్థులంతా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. కొంత మంది విద్యార్థులు కలిసి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. జగన్, విజయమ్మల విజయంతో ఢిల్లీలో రాష్ట్రం ప్రతిష్ఠ నిలబడుతుందని కడపకు చెందిన రంగారెడ్డి అనే విద్యార్థి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడాలనే తపనతోనే ఓటేయడానికి వెళుతున్నామని ఆ విద్యార్థి పేర్కొన్నాడు.
జగన్, విజయమ్మలకు భారీ మెజారిటీ
ఇదిలావుండగా కడప పార్లమెంటు నియోజకవర్గంలో జగన్, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ భారీ మెజారిటీతో గెలుస్తారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాలో జగన్, విజయమ్మల తరుపున 20 రోజుల పాటు ప్రచారం నిర్వహించిన నేతలిద్దరూ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలో జగన్‌కు రెండు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందన్నారు. అలాగే పులివెందులలో విజయమ్మ 30 వేల ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగిస్తారన్నారు.

penchalakona Bramhostava Programmes

13.05.2011 TO 18.05.2011 Bramhostava Programmes
Date / Day
Timings
Programs
13.05.2011
FRIDAY
 
EVENING
AMKURARPANA

14.05.2011
SATURDAY
 

MORNING
DHWAJAROHANAM

EVENING
SAHASRA DEEPALANKARA SEVA

NIGHT
SESHA VAHANA SEVA

15.05.2011
SUNDAY

MORNING
HAMSA VAHANA SEVA


EVENING
SAHASRA DEEPALANKARA SEVA


NIGHT
GOLD HANUMANTHA SEVA

16.06.2011
MONDAY

MORNING
SIMHAVAHANA SEVA

NIGHT
GOLD GARUDA SEVA

17.05.2011
TUESDAY

MORNING
SRI VARI KALAYANAM


EVENING
RADHOTSAVAM


NIGHT
GAJA VAHANA SEVA

18.05.2011
WEDNESDAY

MORNING
CHAKRASNANAM

EVENING
THEPPOTSAVAM
NIGHT
DHWAJAVAROHANAM

తిరిగి కాంగ్రెసులోకి వెళ్లేది లేదు, సోనియాకు దిమ్మ తిరగాలి: జగన్

నెల్లూరు : తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. ఉప ఎన్నికలు విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షలను వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు. అధికారం కోసమో, పదవుల కోసమో విలువలను తాకట్టు పెట్టలేనని స్పష్టం చేశారు.


ఓదార్పు యాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ తనను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకో లేకపోతే తనకు వ్యక్తిత్వమేముందని ఆయన ప్రశ్నించారు. కడపలో జరిగే ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను మార్చివేసేందుకు నాంది పలుకుతాయన్నారు. వైఎస్ఆర్ ను ఆదరించే ప్రజలను ప్రలోభాల ద్వారా మోసగించలేరన్నారు. అయితే కుటుంబంలో ఏర్పడ్డ చీలికే తనను బాధిస్తోందన్నారు. అయినా అధిష్టానం కుట్రను ప్రజలను అర్ధం చేసుకున్నారని జగన్ అన్నారు.


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప నగరంలో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఓటర్లను డబ్బుతో కొనలేదరని అన్నారు. కాంగ్రెస్ డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన జగన్ మరోసారి స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి దిమ్మ తిరిగేలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన కోరారు.

ఢిల్లీ పెద్దలొచ్చినా జగన్‌ మెజారిటీ తగ్గించలేరు

ఢిల్లీనుంచి పెద్దపెద్ద మంత్రులు వచ్చినా జగన్‌, విజయమ్మల మెజారిటీఁ తగ్గించలేరఁ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనాయకఁలు నేదురుమల్లి పద్మనాభరెడ్డి అన్నారు. శుక్రవారం స్థాఁక విలేకర్లతో మాట్లాడుతూ ఎఁ్నకల్లో వైఎస్‌ఆర్‌ కీర్తి ప్రతిష్టలను కడప ప్రజలు గమఁస్తున్నారఁ అత్యధిక మెజారిటీతో తల్లి బిడ్డల గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో సోఁయా గాంధీకి, కడపలో వైఎస్‌ఆర్‌కఁ ఈ పోటీ అఁ, ఇందులో జగన్‌ గెలుపు ఖాయమన్నారు. కేంద్రం మరో 100మంది నాయకఁలను వెనుకేసుకఁఁ వచ్చినా డిపాజిట్లుకూడా దక్కే అవకాశాలు లేవన్నారు. భారతదేశంలోనే కడప ఉప ఎఁ్నకలు సంచలనం సృష్టిస్తున్నాయన్నారు. ఇతర దేశాల్లో ఉన్న వైఎస్‌ఆర్‌ అభిమానులు ఎస్‌ఎంఎస్‌లు, ఇంటర్నెట్‌ల ద్వారా తల్లి బిడ్డలకఁ సహకరిస్తున్నారన్నారు. ఈ ఎఁ్నకల అనంతరం దేశంలో రాజకీయాల్లో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందఁ తెలిపారు. టిడిపి అధ్యక్షఁలు చంద్రబాబునాయుడు జగన్‌ను బిన్‌లాడిన్‌తో పోల్చడం సిగ్గుచేటన్నారు. చిరంజీవి ప్రచారం ఓటర్లలో నమ్మకం పోయిందన్నారు. రానున్న ఎఁ్నకల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడం అనుమానమేనన్నారు. ఎఁ్నకల అధికారులు, కలెక్టర్‌ చట్టపరంగానే వ్యవహరిస్తున్నారన్నారు. జగన్‌అంటే సోఁయాగాంధీకి భయం పుడుతుందన్నారు. తాము ప్రచారం చేసిన పలు మండలాల్లో వైఎస్‌ఆర్‌కే ఓట్లు వేసే పరిస్థితి ఉందన్నారు. ఆయన వెంట ఎంపిటిసి సభ్యులు నేదురుమల్లి రంజన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌ పార్టీనాయకఁలు పెంచలరెడ్డిలు ఉన్నారు.

సింహపురి తీరంలో మరో 'థర్మల్‌' పిడుగు !

సింహపురి తీరంలో మరో 'థర్మల్‌' పిడుగు పడనుంది. 'వీనస్‌ పవర్‌ వెంచర్స్‌ (ఇండియా) లిమిటెడ్‌' స్థాపించనున్న థర్మల్‌ విద్యుత్కేంద్రానికి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా అనుమతి మంజూరు చేసేందుకు సిద్ధమైరది. దాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 350 మెగావాట్లు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 28 ప్రాజెక్టుల ద్వారా 33 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అక్కడ ప్రజలు తరిమికొట్టిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నేలటూరులో నెల్‌క్యాస్ట్‌ విద్యుత్కేంద్రంలో భాగసామ్యమైంది. ఇందులో రూ.150 కోట్ల పెట్టుబడులుపెట్టింది. అవసరానికి మించి థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు అనుమతిలిస్తే జిల్లా వల్లకాడుగా మారుతుందనీ, బూడిద తప్ప మనుషులుండరనీ జనవిజ్ఞాన వేదిక, అఖిలపక్షాలు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులు దృష్టిపెట్టారు. కృష్ణపట్నం పోర్టుకు అనుబంధంగా ప్రాజెక్టులు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. పరిశ్రమలు పెడతామని పేద రైతుల నుంచి భూములను కారు చౌకగా తీసుకుంటున్నారు. వారి భూములకు సక్రమమైన పరిహారమూ ఇవ్వడంలేదు. పారిశ్రామికవేత్తలూ, ప్రభుత్వమూ తామిచ్చిన హామీ మేరకు స్థానికులకు ఉపాధీ, ఉద్యోగావకాశాలూ కల్పించడం లేదు.

అన్నింటికి మించి థర్మల్‌ విద్యుత్కేంద్రాల కాలుష్యంపై ప్రజల్లో తీవ్ర అలజడి ఉంది. ఇప్పటివరకూ 33,285 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి 28 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులకు రోజుకు సుమారు ఐదు లక్షల టన్నుల బొగ్గు వినియోగం జరుగుతుంది. తద్వారా సుమారు రెండు లక్షల టన్నుల బూడిద బయటకొస్తుంది. నెలకు 60 లక్షల టన్నుల బూడిద విడుదలవుతుంది. ఇప్పటికే అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు అఖిలపక్షంగా ఏర్పడ్డాయి. థర్మల్‌ విద్యుత్కేంద్రాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా ప్రజల తరపున విజ్ఞప్తి కూడా వెళ్లింది. గత ముఖ్యమంత్రి రోశయ్య తన వద్దకు వచ్చిన జిల్లా అఖిలపక్షానికి ఇకపై కొత్త అనుమతులు ఇవ్వబోమని హమీ ఇచ్చారు. అయినా అనుమతులు మాత్రం ఆగడం లేదు. ఒక ప్రాజెక్టు తరువాత మరోదానికి అనుమతులు వస్తూనే ఉన్నాయి.

తాజాగా కృష్ణపట్నం సమీపాన హైదరాబాద్‌కు చెందిన వీనస్‌ పవర్‌ వెంచర్స్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ 175 ఎకరాల్లో 350 మెగావాట్ల విద్యుత్కేంద్ర నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా సోంపేటలో అక్కడ ప్రజలు తరిమికొట్టిన నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నేలటూరులో నెల్‌క్యాస్ట్‌ విద్యుత్కేంద్రంలో భాగసామ్యమైంది. సోంపేటలో ఒక్క విద్యుత్కేంద్రం పెట్టేందుకు ప్రయత్నిస్తేనే ప్రజలు పోరాటం సాగించారు. ఇద్దరు ప్రాణ త్యాగం చేశారు. ఇక వీలులేక పారిశ్రామికవేత్తలు అక్కడ నుండి పలాయనం చిత్తగించారు. అలాంటి విద్యుత్కేంద్రాలన్నీ ఇప్పుడు నెల్లూరు జిల్లాకు రావడం, అవి వెలువరించే కాలుష్యంతో పర్యావరణవేత్తలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యంకన్నా పారిశ్రామికవేత్తల జేబులు నింపడానికే ప్రభుత్వం పనిచేస్తోందని జెవివి ఆరోగ్య విభాగం రాష్ట్ర నాయకలు డాక్టర్‌ ఎంవి రమణయ్య విమర్శించారు.

వైయస్ జగన్ మెజార్టీపై జోరుగా పందేలు: కడపలో రూ 40 కోట్లు

నెల్లూరు  : మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల మెజార్టీ సాధిస్తారనే విషయంపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ తర్వాత రెండో స్థానం ఎవరు దక్కించుకుంటారు, మైదుకూరులో మెజారిటీ డీఎల్‌కా? జగన్‌కా? పులివెందులలో గెలుపు విజయమ్మాదా, వివేకాదా తదితరాలపై బెట్టింగ్ రాయళ్లు భారీగా బెట్టింగులకు పాల్పడుతున్నారు. కోట్లు కురిపించే పందెంకోడి ప్రశ్నలు కూడా! ఓవైపు, గెలుపు కోసం కడపలో పార్టీలు కోట్ల రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటే వారిలో ఎవరు గెలుస్తారు? మెజారిటీ ఎంతంటూ రాష్ట్రవ్యాప్తంగా పందెంరాయుళ్లు కోట్లలో పందేలు కాస్తున్నారు. ఈసారి పందెం కాసిన వారిలో రాజకీయ నేతలు, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు ఉండడం గమనార్హం.

కడప జిల్లాలో ఇప్పటికే దాదాపు రూ.40 కోట్లమేర పందేలు జరిగాయని అంచనా. అలాగే, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పందేలు కాశారు. అక్కడ దాదాపు రూ.20 కోట్ల మేర ఉండవచ్చని తెలుస్తోంది. జగన్‌కు రెండు లక్షల మెజార్టీ రాదని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి రూ.10 లక్షలు పందెం కాసినట్లు సమాచారం. గెలుపు, మెజార్టీతోపాటు 2, 3 స్థానాలపై కూడా పందేలు జరుగుతున్నాయి. టీడీపీ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని రెండో స్థానం ఆ పార్టీకే దక్కుతుందని జోరుగా పందేలు జరిగాయి. గెలుపు తథ్యమని, లేకపోతే రెండో స్థానం కాంగ్రెస్‌దేనని కూడా పందెం కాశారు. అనంతపురం జిల్లాలో జగన్‌కు వచ్చే మెజారిటీపైనే భారీ బెట్టింగ్ నడుస్తోంది.

లక్ష, రెండు లక్షలు, మూడు లక్షల మెజారిటీకి తగ్గదంటూ పలువురు బెట్టింగ్ కడుతున్నారు. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం తదితర పట్టణాల్లో జగన్ మెజారిటీపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. లక్షకు పైగా, రెండు లక్షల్లోపు మెజారిటీ వస్తుందని పెద్ద సంఖ్యలో బెట్టింగ్ కడుతున్నట్టు సమాచారం. కోట్లాది రూపాయలకు సంబంధించి బెట్టింగ్‌కు ఒప్పందాలు కుదిరినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రెండు లక్షల పై చిలుకు మెజారిటీ తమ నేతకు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు బెట్టింగ్‌లు కడుతుండగా, యాభై వేల నుంచి లక్షలోపు మెజారిటీ మాత్రమే వస్తుందని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు బెట్టింగ్‌లు పెడుతున్నారు. జగన్ సమీప బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో పందేల ప్రభావం అధికంగా కనిపిస్తోంది.

రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంతకు తగ్గితే రూ. వందకు రూ. రెండు వందలు ఇస్తామంటూ బెట్టింగ్‌లు కాస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనూ పందేల జోరు అధికంగా ఉంది. మెజార్టీ భారీగా తగ్గిపోతుందని కొందరు, పాత మెజార్టీ కంటే పెరిగి 2 లక్షల మెజార్టీ జగన్‌కు లభిస్తుందని మరికొందరు పందేలు కాస్తున్నారు. 50 వేల మెజార్టీపై రూ.10 నుంచి 20 వేల వరకు పందేలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కంటే పందెపు రాయుళ్లలోనే టెన్షన్ అధికమైంది.

పరిచయమున్న పత్రికా ప్రతినిధులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది నుంచి ఏ రోజుకారోజు పరిస్థితిని తెలుసుకుంటూ అనుకూలంగా పందేలు కాస్తున్నారు. జగన్‌కు లక్ష నుంచి 2 లక్షల వరకు మెజార్టీ రాదని చెప్పేవారు రూపాయికి రెండు రూపాయిలు ఇచ్చే విధానంపై పందెం కాశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా పందేలు జరగడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరులో, జగన్‌కు పులివెందులలో, మైసూరారెడ్డికి కమలాపురంలో మెజార్టీ వస్తుందని పందేలు జరిగాయి. ఇక, పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతం, పోలింగ్ తీరు, రాజకీయ పక్షాల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పందేలు మరింత జోరందుకోనున్నాయి.

జగన్‌ 3,50,000 మెజారిటీతో గెలుపు ఖాయం-నేదురుమల్లి

వాకాడు: 3,50,000 మెజారిటీతో వైయస్‌ జగన్‌ గెలుపు ఖాయమని, వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఢిల్లీ నుండి పెద్ద పెద్ద మంత్రులు వచ్చినా, జగన్‌, విజయమ్మల మెజారిటీని తప్పించలేరన్నారు. సోనియాగాంధీ, వైయస్‌ఆర్‌ అభిమానుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వైయస్‌ఆర్‌ కీర్తిప్రతిష్టలను కడప ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబునాయుడు, జగన్‌ను లాడెన్‌తో పోల్చటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. చిరంజీవి జిమ్మిక్కులు కడప ప్రజలు వినే పరిస్థితులో లేరని వారు తెలిపారు. జగన్‌ గెలుపుతో భారతదేశ రాజకీయాలలో పలుమార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, చట్టపరమైన చర్యలు చేపడుతున్నారన్నారు. సోనియాగాంధీకి కడపలో జరుగుతున్న పరిణామాలతో జగన్‌ అంటే భయం పుడుతుందన్నారు. ఇకనైనా సోనియాగాంధి కళ్లు తెరవకపోతే అనేక పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన అన్నారు. తాను ప్రచారం చేసిన పులివెందుల, బద్వేలు, కమలాపురం, చింతలగుంటలపాలెం, ప్రొద్దుటూరు, వేంపల్లి, కడప రూరల్‌, అర్బన్‌, వైయస్‌ఆర్‌ పుట్టిన బల్పానూరు ప్రాంతాలలో వైయస్‌ఆర్‌ అభిమానులు అధికసంఖ్యలో జేజేలు కొడుతున్నారన్నారు. ఇతర దేశాలలో ఉన్న వైయస్‌ఆర్‌ అభిమానులు ఇంటర్నెట్‌ ద్వారా, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జగన్‌ విజయానికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి రంజన్‌రెడ్డి, పెంచలరెడ్డి ఉన్నారు.

మేకపాటి సంస్థల్లో జగన్‌ డబ్బు రూ.8 వేల కోట్లు : ఆనం వివేకానందరెడ్డి

నెల్లూరు : మేకపాటి సోదరుల వ్యాపార సంస్థల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన డబ్బు రూ.8 వేల కోట్లు రొటేషన్‌ అవుతుందని నెల్లూరు రూరల్‌ ఎమ్మల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరు మినీ బైపాస్‌ రోడ్డులోగల సామాజిక వికాస భవనంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మేకపాటి సోదరులపై పలు ఆరోపణలు చేశారు. జగన్‌కు సంబంధించిన రూ.1.40 లక్షల కోట్ల ఆస్తుల్లో రూ.40 వేల కోట్లు మాత్రం స్థిరాస్తుల రూపంలో ఉన్నాయని, మిగిలిన లక్ష కోట్ల ధనాన్ని వ్యాపార మిత్రులవద్ద రొటేషన్‌ చేస్తున్నాడని అన్నారు. ఆ జాబితాలో మేకపాటి సోదరుల పేర్లున్నాయన్నారు. మేకపాటి సోదరులు కచ్చితంగా విశ్వసనీయతలేని నీతిమాలిన రాజకీయ నాయకులు అన్నారు. ఏ మాత్రం నీతి, నిజాయితీ ఉన్నా రాజీనామా చేసి జగన్‌ వైపు వెళ్లి ఉండేవారన్నారు. కడపను సర్వనాశనం చేయడానికే జగన్‌ కంకణం కట్టుకున్నాడన్నారు. కడప అభివృద్ధిని తన రాజకీయ స్వార్ధంతో చిన్నాభిన్నం చేస్తున్నాడనీ, సీఎంకావాలనే అశతోనే పెంచిపోషించిన కాంగ్రెస్‌కు ద్రోహంచేసి రాజీనామా చేసినట్లు ఆనం చెప్పారు.
కడపలో చిరంజీవి ప్రచారంతో కాంగ్రెస్‌ పుంజుకుందన్నారు. చిరంజీవి, చంద్రబాబుపై దాడులు జరిగిన తర్వాత జగన్‌ పలుకుబడి దిగజారిందన్నారు. ఈ సమావేశంలో నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పిండి సురేష్‌, సూళ్లూరు రమాదేవి, సంక్రాంతి కల్యాణ్‌, కాం గ్రెస్‌ నాయకులు మేఘనాధ్‌సింగ్‌, డి.రాజానాయుడు, కె.హరికుమార్‌, షేక్‌ నన్నేసాహెబ్‌, సూళ్లూరు దేవరాజులు పాల్గొన్నారు.

సండేమార్కెట్‌లో పెరుగుతున్న అరాచకం-పోలీసుల మౌనం

నెల్లూరు : నెల్లూరుజిల్లా నడిబొడ్డున ఉన్న సండేమార్కెట్‌ గత చరిత్ర ఉంది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు నిత్యం సండేమార్కెట్‌లో వ్యాపారాలు చేస్తూ రద్దీగా ఉంటుంది. ప్రతి దినం ఇక్కడ వ్యాపారాలు మూడుపువ్వులు ఆరు కాయలుగా జరిగేవి. పల్లె జనం ఎక్కువగా సండేమార్కెట్‌ను ముందుగా దర్శించుకుని, అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ లభ్యమవు తుండటంతో ఈ మార్కెట్‌లో వ్యాపారాలు విస్తృతంగా సాగేవి. అయితే గతంలో టౌన్‌లోని వివిధ వ్యాపార సంస్థలతో పోల్చుకుంటే ధర సరసమైనవిధంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. వ్యాపారులంతా సిండికేట్‌ అయి, ఒక వస్తువుకి ఒకే ధర అనే నినాదంతో మార్కెట్‌ వ్యాపారులంతా ఈ షరతులు పాటించాలని, సంఘం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటూ వ్యాపారులు నిర్వహిస్తుండేవారు. ఈ విధంగా ఇక్కడ వ్యాపారులు షాపులు లీజుకు ఇవ్వరాదని, ప్రతి నెల శుక్రవారం సెలవు పాటించాలని, అన్ని షాపులు ఒకే ధరకు వస్తువులు విక్రయించాలనే మూడు షరతులతో ముందుకు సాగుతున్న ఈ వ్యాపారాలు కాస్త పేద, మధ్య తరగతుల వారికి వినియోగదారులకు కష్టతరంగా మారిన, ఇక్కడున్న వ్యాపారులంతా సామాన్యులే కనుక మూడు షరతుల వల్ల ప్రయోజనకారిగా మారిందనే విషయం వాస్తవం. అయితే యూనియన్‌ పేరుతో షరతులను తప్పక పాటించాలనే విషయంలో కొందరు అతిక్రమించటమేకా కుండా ప్రత్యక్షదాడులకు దిగేస్థాయికి దౌర్జన్యాలకు దిగే సంస్కృతి మొదలయింది. ఇందుకు నిదర్శనంగా గత వారం అర్జున్‌ అనే వ్యాపారి శరవణ్‌ అనే వ్యాపారిపై దాడికి పాల్పడి, తలపగలకొట్టి ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడటం, అందుకు అతని అనుచరులను పురికొల్పటం వంటి రౌడీయిజం, మార్కెట్‌లో పెచ్చుమీరుతున్న సందర్భాలున్నాయి. జిల్లా పోలీసులు ఈ విషయంలో చొరవచూపి, సండేమార్కెట్‌లో జరుగుతున్న దౌర్జన్యమా? ఆధిపత్యపోరా? రౌడీయిజమా? ఏదైనా కావచ్చు ఇటీవల అరాచకం జరుగుతుంది. వ్యాపారుల మధ్యే కాకుండా అక్కడకు వచ్చే వినియోగదారులపై కూడా కొందరు జులు ప్రదర్శించటం జరిగిన సందర్భాలున్నాయి. గతంలో జెండావీథి వినియోగదారులపై జరిగిన గొడవ పోలీసుల వరకు వెళ్ళింది. ఈ సంఘటనల దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం సండేమార్కెట్‌ నిర్వహణపై దృష్టిపెట్టి , మార్కెట్‌లోని వినియోగదారులు, వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా చూడాల్సిన అవసరం జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉంది.

మే 11 నుంచి నెల్లూరు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు


నెల్లూరు జిల్లాలోని పెన్నానది తీరాన గల నరసింహకొండపై వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ నుండి ప్రారంభం కానున్నాయి. మే 11వ తేదీన స్వామి వారికి అంకురార్పణతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. మొత్తం 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.

మే 11, 2011 - అంకురార్పణ
మే 12, 2011 - స్వామివారికి ధ్వజారోహణ, చప్పర ఉత్సవం, రాత్రికి శేషవాహన సేవ
మే 13, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి హంసవాహనం
మే 14, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు
మే 15, 2011 - ఉదయం స్వామివారికి చప్పర ఉత్సవం, రాత్రి స్వామి వారికి హనుమంతసేవ
మే 16, 2011 - ఉదయం మోహినీ ఉత్సవం, సాయంత్రం అఖండజ్యోతి, తెల్లవారుజామున 3 గంటలకు బంగారు గరుడసేవ
మే 17, 2011 - సాయంత్రం స్వామివారి కల్యాణం, రాత్రి గజవాహనసేవ, పూలంగిసేవ
మే 18, 2011 - ఉదయం నరసింహపురం (కొండకు దిగువభాగం)లో స్వామివారి రథోత్సవం
మే 19, 2011 - ఉదయం చప్పర ఉత్సవం, రాత్రి అశ్వవాహనం
మే 20, 2011 - ఏడు కోనేర్ల వద్ద చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ
మే 21, 2011 - రాత్రి స్వామివారికి ఏకాంతసేవ (బ్రహ్మోత్సవాలు ముగింపు)

స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తుల కాలక్షేపార్థం ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 16వ తేదీన "కురుక్షేత్రం" పూర్తినాటక ప్రదర్శన, తెల్లవారుజామున 3 గంటలకు "సత్యహరిశ్చంద్ర" కాటిసీను, 4 గంటలకు "రామాంజనేయ యుద్ధం" ప్రదర్శనలుంటాయి. అలాగే 17వ తేదీన రాత్రి 10 గంటలకు "గయోపాఖ్యాణం" యుద్ధసీను, "చింతామణి" భవాని సీను, అర్ధరాత్రి 12 గంటలకు "సత్యహరిశ్చంద్ర" పూర్తి నాటకాలు ప్రదర్శిస్తారు.

కామాక్షితాయి సన్నిధి:

నరసింహస్వామి కొండకు దిగువ భాగాన ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి సమేతంగా కామాక్షితాయి సన్నిది ఉంది. కోరిన వారికి కోటి వరాలిచ్చే కల్పవల్లి ఈ కామాక్షితాయి. పెన్నానదిని ఆనుకొని ఈ ఆలయం ఉంది. పవిత్రనదిలో స్నానమాచరించి, అమ్మవారిని దర్శించుకొని మనసారా నమస్కరించి కోరికలు కోరుకుంటే అమ్మవారు తప్పక నెరవేరుస్తారని వేలాది మంది భక్తుల నమ్మకం. లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లిన భక్తులందరూ తప్పకుండా కామాక్షి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్తారు.
English summary
Sri Vedagiri Lakshmimarasimha Swamy Brahmothsavams starts from 11th May 2011 in Nellore District. This temple in its present form came into being nearly 500 years ago, on the summit of Narasimhakonda on the the bank of Pinakini (Penna River). This holy place lies 15 km away from Nellore Town, on the southern bank of the river Pinakini. Every year “Brahmotsavams” are celebrated here in the month of May.
sale your old used computer
usedsystemsblogspot.in
used computer buyer andhra pradesh